మహదేవపూర్, మార్చి 26 : వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సాసర్పిట్స్, వాటర్ హోల్స్ను గతంలో ఏర్పాటుచేయగా అధికారుల పర్యవేక్షణ లోపించి, తాగునీరు లభించక మూగజీవాలు అల్లాడుతున్నాయి. ఓ వైపు ఎండలు ముదురుతున్న సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోకుంటే జీవాల మనుగడకే ముప్పు వాటిల్లనుంది.
అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో మహదేవపూర్ అడవుల్లో సుమారు ఆరు సోలార్ బోర్లు, 20 సాసర్ పిట్స్, 20 వాటర్ హోల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో సోలార్ బోర్ సమీపంలో కృత్రిమంగా నీటికుంట తవ్వించారు. వేసవిలో బోర్ల సాయంతో నీటిని కుంటల్లో నింపి వన్యప్రాణులకు అందుబాటులో ఉంచాలి. కానీ అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో సోలార్ బోర్లు పనిచేయడం లేదు. దీంతో నీరు లేక కుంటలు ఎండిపోయి నెర్రెలుబారాయి. వేసవిలో ప్రత్యేకంగా ట్యాంకర్ ద్వారా సాసర్ పిట్స్, ఫామ్పాండ్స్లో నీటిని నింపాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఎక్కడ కూడా నీటిని నింపడం లేదు. ఈ విషయమై అటవీ శాఖ మండల అధికారి కమలను వివరణ కోరగా వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, సోలార్ బోర్లకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని, సాసర్ పిట్స్, కుంటల్లో నీరు నింపుతామని తెలిపారు.