Palla Rajeshwar Reddy | చేర్యాల, మే 3 : దేవాదుల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయించాలని, మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు సాగునీటి కాల్వ పనులు పెండింగ్లో ఉన్నాయని యుద్దప్రాతిపదికను నిర్మాణ పనులు పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీసుకెళ్లారు. హనుమకొండ దేవన్నపేట పంపు హౌజ్ వద్ద దేవాదుల మూడో దశ పనులను మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లు వాటి పరిస్ధితుల, పెండింగ్ పనులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీసుకెళ్లారు.
మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి వద్ద ఆగిపోయిన కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. తపాస్పల్లికి మల్లన్నసాగర్ గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువచ్చే పనులు 25శాతం పూర్తయ్యాయని, పనులను మరింత వేగంగా పూర్తి చేస్తే ధర్మసాగర్ నుంచి గండి రామారం మీదుగా తపాస్పల్లి వెళ్లే భారం తక్కువ అవుతుందని తెలిపారు. ఫలితంగా ఘన్పూర్, పాలకుర్తి వంటి తదితర ప్రాంతాలకు నీరు ఎక్కువ వస్తుందని చెప్పారు. ఈ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని గతంలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు కెనాల్ పనులు నిలిచిపోయాయని, నిధులు కేటాయించి కొనసాగించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతున్న కెనాల్ పనులు గత రెండేళ్లుగా నిలిచిపోయినట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా భూమిని సేకరించి కొంతమందికి పరిహారం ఇచ్చిన్నప్పటికీ ఇంకా కొంతమందికి పరిహారం ఇవ్వకపోవడం వల్ల పనులు ఆగిపోయినట్లు తెలిపారు. గతంలో భువనగిరిలో జరిగిన సమీక్షలో మంత్రి దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. నిర్మాణ పనులను గ్రీన్ చానల్లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గత సీజన్లో నిర్వహణ డబ్బులు ఆలస్యంగా ఇవ్వడం వల్ల 34 రోజులు మోటర్లు ఆపివేయడం దురదృష్టకరమని, ఇక నుంచి నిర్వహణ పనులకు సంబంధించిన నిధులను గ్రీన్ చానెల్ పెట్టాలని కోరారు.