న్యూఢిల్లీ : ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిన బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా థెరపీని కరోనా ప్రోటోకాల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్యారోగ్యశాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇకపై కరోనా చికిత్సలో వినియోగించే ప్లాస్మా థెరపీ నిలిచిపోనుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కొద్ది రోజుల ద్వారా ప్లాస్మా దానం చేస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ఇచ్చేవారు. తద్వారా రోగి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని పలువురు వైద్యులు పేర్కొన్నారు. అయితే, ప్మాస్మా థెరపీ వల్ల మరణాలను అడ్డుకోలేమని, పెద్ద ఉపయోగం లేదని ఐసీఎంఆర్ గతంలోనే పేర్కొంది.
ఇప్పుడు కరోనా చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఒక వేరియంట్ వైరస్ సోకిన బాధితులకు మరో వేరియంట్ కరోనా సోకిన బాధితుల ప్లాస్మా ఇవ్వడంతో కొత్త మ్యుటేషన్లు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నా.. విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స చేస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం పలువురు శాస్త్రజ్ఞులు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయరాఘవన్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు.. బ్రిటన్లో జరిగిన ఒక అధ్యయనంలో కూడా ప్లాస్మా చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదని తేలింది. గత ఏడాది మనదేశంలో 400 మంది రోగులపై ఐసీఎంఆర్-ప్లాసిడ్ ట్రయల్స్ నిర్వహించగా.. ఇదే తేలింది. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు కనిపించిన ఏడు రోజుల్లోపు.. అది కూడా హైటైటర్ డోనర్ దొరికితే.. ‘ఆఫ్ లేబుల్’ ప్లాస్మా థెరపీకి అవకాశం ఉంది.
‘ఆఫ్ లేబుల్’ అంటే.. అనుమతి లేకున్నా అత్యవసర సమయంలో ఈ చికిత్స చేయవచ్చు. కానీ, చికిత్సతో ప్రభావం లేదని తేలిన నేపథ్యంలో నిలిపివేస్తూ ఐసీఎంఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా ఐసీఎంఆర్, ఎయిమ్స్, టాస్క్ ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా కొవిడ్ రోగులకు చికిత్సకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. శ్వాసం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే స్వల్ప లక్షణాలుగా భావించాలని సూచించింది. అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్లోనే ఉంచి చికిత్స అందించాలని చెప్పింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 90 – 93 మధ్యన ఉన్నా.. రెస్పిరేటరీ రేటు నిమిషానికి 24 కన్నా ఎక్కువగా ఉన్నా.. మధ్యస్థ స్థాయిగా భావించాలని, ఇలాంటి రోగులను ఆస్పత్రిల్లోని వార్డులో చేర్పించి చికిత్స ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
AIIMS/ICMR-COVID-19 National Task Force/Joint Monitoring Group, Ministry of Health & Family Welfare, Government of India revised Clinical Guidance for Management of Adult #COVID19 Patients and dropped Convalescent plasma (Off label). pic.twitter.com/Dg1PG5bxGb
— ANI (@ANI) May 17, 2021