ప్రాణం పోసే చేతులే ప్రాణం తీస్తున్నాయి. బిడ్డకు జన్మనిచ్చే అమ్మ.. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడే నాన్న ..వీరిద్దరిని మించిన దైవం మరొకటి లేదనేది అందరి నమ్మకం. ఆ నమ్మకం నేటి రోజుల్లో ముక్కలవుతున్నది. నూరేళ్లు నిండక ముందే చిన్నారుల ఆయుష్షును కన్నవారే హరిస్తున్నారు. క్షణికావేశం అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు కారణం ఏదైనా పసి పిల్లల రక్తంతో కన్నవారి చేతులు తడిసిపోతున్నాయి.రక్షణ కవచం కావాల్సిన వాత్సల్యం రాక్షసత్వంగా మారి చిన్నారుల పాలిట మృత్యుపాశం అవుతున్నది. కన్న వాళ్ల ఒడిలోనే భద్రత పొందాల్సిన పిల్లలు అదే ఒడిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. కాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య, పిల్లల ప్రాణాలు తీసిన ఘటన ఒకచోట.. భర్త వివాహేతర సంబంధంతో భార్య తన పిల్లలను చంపి, తాను తనువు చాలించిన ఘటన మరోచోట.. ఫ్లష్ ట్యాంక్లో శిశువు మృతదేహం.. హైదరాబాద్లో జరిగిన ఈ విషాదకర ఘటనలు అందరిని కలిచి వేస్తున్నాయి.
మూసాపేట, మార్చి31: కన్న బిడ్డలకు కష్టం రాకూడదని కంచు కవచంలా నిలిచే తల్లి ఇద్దరి బిడ్డలను తన చీర కొంగుతో ఉరితీసి ఆపై తాను తనువు చాలించిన విషాదకర ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి సీఐ వెంకట సుబ్బరావు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నరావు పేట మండలం మాణిక్యాల తండాకు చెందిన ప్రవీణ్ అదే ప్రాంతానికి చెందిన బానోతు స్రవంతి(27)ని 13 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కూకట్పల్లి పరిధి కైత్లాపూర్ రాఘవేంద్రనగర్ కాలనీలో సొంత ఇంటిలో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ దంపతులకు కార్తీక్(12), కౌశిక్(10) ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ప్రవీణ్ రెండేండ్ల క్రితం వేరే అమ్మయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో దంపతుల మధ్య తరుచుగా గొడువలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇంట్లో పెద్ద గొడువ జరగడంతో స్రవంతి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రవీణ్ స్రవంతి ఇంటికి వెళ్లి పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టించి భార్యను, పిల్లలను మంచిగా చూసుకుంటానని సోమవారం సాయంత్రం కైత్లాపూర్ కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం రోజులాగే ప్రవీణ్ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజనానికి ఇంటికి వచ్చే సరికి ఇంటి డోరు లోపలి నుంచి లాక్ చేసి ఉండడంతో చుట్టు పక్కల వారి సహాయంతో డోర్ తీసి చూసే సరికి భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో భార్యా పిల్లలపై దాడి
ఆమనగల్లు, మార్చి 31 : మద్యం మత్తుతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి భార్య, కొడుకు, కూతురిపై రోకలి బండతో దాడి చేశారు. భార్య, కుమారుడు మృతిచెందగా, కూతురు దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలో జరిగింది. ఆమనగల్లు మండలం సీతారాంనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాకు చెందిన బాణావత్ రాందాస్నాయక్కు భార్య కవిత (28), ముగ్గురు ఆడపిల్లలు పవిత్ర (11) పావని (10) ప్రణీత, ఒక కుమారుడు హర్షిత్ (5) ఉన్నారు. పవిత్ర, పావని ఇద్దరు హాస్టలో ఉంటూ చదువుకుంటున్నారు. మద్యానికి బానిసైన రాందాస్ నాయక్ తరుచూ భార్యతో గొడవ పడుతూ సోమవారం రాత్రి భార్య కవిత, కుమారుడు హర్షిత్, కూతురు ప్రణీతపై రోకలి బండతో దాడిచేశాడు. కవిత, హర్షిత్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ప్రణీతను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్లష్ట్యాంక్లో శిశువు మృతదేహం
మూసాపేట: వాష్రూమ్ ఫ్లష్ట్యాంక్లో శిశువు మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి రాందేవరావు ఆసుపత్రి ఓపీడీ మహిళల వాష్ రూమ్ను క్లీన్ చేయడానికి వెళ్లిన ఆయా నర్సమ్మకు ఫ్లష్ట్యాంక్లో పసికందు మృతదేహం కనిపించింది. నర్సమ్మ ఆసుపత్రి సిబ్బందికి పోలీసులుకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మహిళ బిడ్డకు జన్మనిచ్చి ట్యాంకులో పడేసి ఆధారాలు దాచే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.