Viseshini Reddy | అమ్మమ్మల కాలంనాటి గుండ్లమాల, మకర కుండలాలు ఇక్కడ కొత్తగా ప్రాణం పోసుకుంటున్నాయి. నేటి యువతుల అభిరుచికి తగినట్టు ఆధునిక రూపాన్ని ధరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైన ఆభరణాలకు హైదరాబాద్లో వేదిక కల్పించి.. అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు ‘హవ్యా జువెల్స్’ వ్యవస్థాపకురాలు విశేషిణి రెడ్డి.
చిన్నప్పటి నుంచీ తనకు నగలంటే ఇష్టం. అమ్మ, అమ్మమ్మ పెట్టుకునే సొమ్ములు చూసి మురిసిపోయేది. పండుగ పబ్బాలకు తానూ అలంకరించుకుని సంబురపడేది. క్రమంగా స్వర్ణాభరణాలు, వజ్రాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ జిజ్ఞాస రత్నశాస్త్రం.. ‘జెమాలజీ’ వైపు అడుగులు వేయించింది. ఖరీదైన చదువుల కోసం అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక.. కష్టపడి చదివి ప్రతిష్టాత్మకమైన జీఐఏ స్కాలర్ షిప్ సాధించింది. వజ్రాలు, రత్నాల వంటి పదిహేను రకాల జాతిరాళ్లపై లోతైన అధ్యయనం చేసింది. ఆ పరిజ్ఞానంతో ‘హవ్యా జువెల్స్ (Havya Jewels)’ పేరుతో ఆభరణాల వ్యాపారంలోకి వచ్చింది.
భూగర్భంలో వజ్రం రూపకల్పన ప్రక్రియను అనుకరిస్తూ.. దాదాపుగా అలాంటి రసాయన సమ్మేళనంతో కృత్రిమ వజ్రాలను తయారు చేయడం ఓ వినూత్న విధానం. ఈ తరహా డైమండ్స్ను హైదరాబాద్కు పరిచయం చేసిన ఘనత ఆమెదే. సానబట్టిన తర్వాత ఇవి సహజమైన వజ్రాల్లానే కనిపిస్తాయి. అంతర్జాతీయ నిర్ధారణ సంస్థలు మాత్రమే ఆ సున్నితమైన తేడాను గుర్తించగలవు. ‘ల్యాబ్లో వజ్రాలు తయారు చేసుకోవడం వల్ల.. గనులపై ఒత్తిడి తగ్గుతుంది. నేలతల్లికి గునపపుపోట్లు తప్పుతాయి. అంతేకాదు, గనులు పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఈ ఉత్పాతాన్ని కూడా మనం తప్పించవచ్చు’ అంటారు విశేషిణి. బంగారు గనులపై కూడా ఒత్తిడి తగ్గాలన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. ఆ కారణంగానే, హవ్యా జువెలర్స్లో రీసైకిల్డ్ బంగారానికే ప్రాధాన్యం ఇస్తారు.
కొవిడ్ సమయంలో మొదలైన విశేషిణి నగల వ్యాపారం ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. చాలా వేగంగా లాభాల బాటలోకి వచ్చేసింది. దాదాపు పాతికమంది ప్రముఖ డిజైనర్లు రూపొందించిన నగలు ఇక్కడ కొలువు దీరాయి. తాతమ్మల కాలం నాటి గుండ్లమాల, మకర కుండలాల నుంచి.. నేటి ఫ్యాషన్ నగల వరకూ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ట్రెండ్కు తగ్గట్లుగా వ్యాపారాన్ని విస్తరించాలనేది విశేషిణి ఆలోచన. ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా.. వర్చువల్గా నచ్చిన నగలను ఎంచుకునేందుకు ఓ యాప్ను పరిచయం చేయబోతున్నారు. కెమెరా క్లిక్ చెయ్యగానే ఇంట్లో కూర్చునే ఒంటికి నప్పే నగలను ఎంచుకోవచ్చు. అక్కడికక్కడే ఆర్డర్ చేయవచ్చు. ఆభరణాలకు నప్పే వస్ర్తాలను ధరించినప్పుడే మహిళ సౌందర్యం ఇనుమడిస్తుంది. అలాంటి దుస్తులనూ అందించాలన్నది ఆమె వ్యాపార ప్రణాళిక. ఈ దిశగానూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వజ్రాలు, రత్నాలు పొదిగిన ఫ్యాషన్ ఆభరణాల ధర రూ.500 నుంచే మొదలవుతుంది. కస్టమర్లు వారి బడ్జెట్లో మనసుదోచే నగలను తయారు చేయించుకోవచ్చు.
‘పోటీ ప్రపంచంలో ప్రతి యువతీ ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానిని సాధించే దిశగా స్థిరమైన అడుగులు వెయ్యాలి. నా దృష్టిలో లక్ష్యం లేని జీవితం వృథా. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. మనకు ఏం కావాలన్నది మనమే గ్రహించాలి. తెలియని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడిప్పుడే మార్కెట్లో మా బ్రాండ్ పేరు వినిపిస్తున్నది. మరింత ప్రచారం కోసం ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాం. నగల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. నాన్న రవికాంత్ రెడ్డి, అమ్మ హరిత. నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. నాన్న నన్ను మొదట్నుంచీ ప్రోత్సహిస్తూ పెట్టుబడి పెట్టారు. జాగ్రత్తగా ఖర్చు చేయడం నాన్న నుంచే నేర్చుకున్నాను. తీరిక సమయాల్లో కుటుంబ హోటల్ బిజినెస్లో సాయం చేస్తుంటాను. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అంటారు విశేషిణి.
…✍ రవికుమార్ తోటపల్లి, 📷 ఎం.గోపీకృష్ణ
“అప్పుడు చెత్తతో ఏం పని అన్నరు.. కానీ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తోంది”