కాచిగూడ,ఆగస్టు 12: స్థానికుల సహకారంతో నియోజకవర్గంలోని డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్లో భాగంగా శుక్రవారం చెప్పల్బజార్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాదయాత్ర నిర్వహించారు. డ్రైనేజీ సమస్య, లో ఫ్రెషర్ నీటి సమస్య తదితర సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక ప్రజల సహకారంతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తూ, మౌలిక సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యలను సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన అధికారులను హెచ్చరించారు.
బస్తీలో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికై కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈజీఎం సన్యాసిరావు, మేనేజర్ భావన, కాచిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, దాత్రిక్ నాగేందర్బాబ్జి, పాండురంగా, సుర్యారావు, బాబు, నిఖిల్, నాని, మహేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.