హనుమకొండ, మే 8: ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డి వరంగల్ పర్యటనలో తమ ప్రసంగాల్లో వరంగల్ అభివృద్ధిపై మాట్లాడకపోవడం విచారకరమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్తో కలిసి విలేకరుల సమావేశంలో భద్రకాళి, రామప్ప ఆలయ అభివృద్ధి, నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై కాకుండా ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డి పూర్వ సమస్యల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మత రాజకీయాలు చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసపూరిత, అమలు కాని హామీలతో మరోసారి మోసం చేయాలని చూస్తోందన్నారు. మోదీ తన ప్రసంగంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల గిరిజన యూనివర్సిటీని నామమాత్రంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభించ లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తల్లిని చంపి బిడ్డను వేరుచేశారన్న ప్రధాని మోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కులేదన్నారు. రాహుల్గాంధీ ఇటీవల మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రూ.2500 ఖాతాలో జమ అవుతున్నాయనడం విడ్దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులపై బతుకుతోందని దుయ్యబట్టారు. ఐదు నెలలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడంలేదని, విదేశీ విద్య నిధులు విడుదల కావడంలేదని, కల్యాణలక్ష్మి వంటి పథకాలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. వరంగల్ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్గౌడ్, కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, మైనారిటీ నాయకుడు నయీముద్దీన్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వంటి ద్రోహులు, మోసకారులకు ఓటుతో దెబ్బకొట్టాలి. బీఆర్ఎస్ పార్టీ అరూరి రమేశ్ను బీజేపీలోకి పంపి లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న సీఎం రేవంత్రెడ్డి.. కడియం శ్రీహరిని కూడా కాంగ్రెస్లోకి మేమే పంపించామని చెప్పాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడొద్దు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30కోట్ల నిధులను క్యాన్సల్ చేసింది మీరు కదా? భద్రకాళి ఆలయానికి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ఉద్యమకారులకు, ద్రోహులకు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.
నా గెలుపు ఖాయమైంది. ఇప్పటికే ప్రభంజనాన్ని చూసి భయంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడుసార్లు, ప్రధాని మోదీ ఒకసారి వరంగల్కు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నన్ను దిష్టిబొమ్మ అన్నారు. అవును నేను దుష్టశక్తులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను అడ్డుకొనే దిష్టిబొమ్మనే. వెకిలి మాటలు, చేష్టలు చేస్తున్న సీఎంను ప్రజలు మూడు నెలల్లోనే తిరస్కరించారు. ఒక డమ్మీ ముఖ్యమంత్రివి నువ్వు.. ఒక ఉద్యమకారుడిని నేను. మంగళవారం వస్తే.. బుధవా రం బడే భాయ్ వచ్చారు. కడియం కావ్యకు అసలు సభ్యత్వం లేదు. మోసపూరిత వ్యక్తులు కడియం శ్రీహరి. అరూరి గురించి ఎవరిని అడిగినా చెబుతారు. వరంగల్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. ఓరుగల్లు ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇస్తారు.
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నకిలీ కడియం కావ్య నకిలీ మతస్తురాలు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. 30ఏళ్ల దండోరా ఉద్యమంలో కడియం కావ్య పాత్రలేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకమన్న కాంగ్రెస్ కుటుంబ పాలనే ప్రోత్సహిస్తోంది. కడియం శ్రీహరి, బుద్ధి చెప్పేందుకు ఆ పార్టీ నాయకులే కంకణబద్ధులవుతున్నారు. కడియంపై తిరగబడేందుకు మంత్రి కొండా సురేఖ, ఇందిర డబ్బుతో గెలుస్తామనుకుంటున్నారు. కడియం కావ్యను ఓడించడమే కాకుండా ఎన్నికలతో కడియం శ్రీహరి రాజకీయ జీవితం సమాధి కావడం ఖాయం.