KTR | నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/గద్వాల, మే 8 : ‘ప్రధాని మోదీలైన్లోనే సీఎం రేవంత్రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు. చోటేభాయ్ కాంగ్రెస్, బడేభాయ్ బీజేపీతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోరాడుతున్నదని, బీఆర్ఎస్కు 10-12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ దేశ రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రోడ్షోల్లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ గారడీలేలని, అబద్ధపు హామీలతో మోసం చేసిన ఆ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పేగులు మెడలో వేసుకుంటా అంటూ ఉద్యమ నేతనుద్దేశించి సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఆర్థిక సాయం అందలేదని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్ రావడం లేదని, సిగ్గు లేకుండా రేవంత్రెడ్డి ఐదు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు, రేవంత్ సంక్షేమ పథకాల అమలు తేదీలు మార్చుతున్నారని, ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి జలదీక్ష చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాగునీటి విషయంలో చొరవ చూపలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో లక్షన్నర పెండ్లిళ్లు జరిగాయని, వారందరికీ రేవంత్ తులం బంగారం బాకీ ఉన్నాడని చెప్పారు. బీఆర్ఎస్ తులసీ వనమైతే, కాంగ్రెస్, బీజేపీలు ఈ వనంలో గంజాయి మొక్కల్లాంటివని, వాటిని పీకేయాల్సిన అవసరం ఈ ఎన్నికల్లో వచ్చిందని ప్రజలకు సూచించారు. నిర్మల్ సభలో రాహుల్గాంధీ మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.
కృష్ణాబేసిన్లో మన వాటా తేల్చాలని పదేళ్లుగా అడుగుతున్నా కేంద్రం పట్టించుకోలేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్దేని గుర్తుచేశారు. ‘క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదు? మోదీ హయాంలో ప్రజలపై 34 శాతం సుంకం వేశారు.. ప్రజలు రూ.30 లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తే రూ.14లక్షల కోట్లు అదానీ, అంబానీకి రుణమాఫీ చేసింది మోదీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రామమందిరం పేరుతో ఓ ట్లడగడం తప్ప దేశానికి బీజేపీ చేసిందేమీ లే దని విమర్శించారు. మోదీ ఒక్కటే ఒక్క పని చేసిండని, పిల్లల మనుసుల్లో హిందూ ముస్లిం వ్యతిరేకత తెచ్చిండని మండిపడ్డారు. రాములును ఎంపీగా గెలిపిస్తే బీజేపీలోకి ఎందుకు పోయిండో సమాధానం చెప్పాలని నిలదీశారు. నాగర్కర్నూల్ ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీజేపీ దుర్మార్గమైన పార్టీ అని, ఆ పార్టీకి ఎవరూ ఓట్లు వేయొద్దని, కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దళితుల మూతికి ముంత కట్టే రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి మహనీయుల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కర్ణాటకకు చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వేలాది మంది మహిళలపై అత్యాచారం చేస్తే, అలాంటి వ్యక్తి తరఫున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేయడం నీచంగా ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్, పార్లమెంట్ ఇన్చార్జి రంగినేని అభిలాష్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి పాల్గొన్నారు.