కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించారు. 1,715 మందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోగా… పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు కలిపి 1,224 మందికి విధులు పంచారు. మిగతా 491 మందిని రిజర్వులో ఉంచారు. నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలివెళ్లారు.
రాత్రి 7గంటల వరకు పోలింగ్..
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్నది. కొవిడ్ నేపథ్యంలో అదనంగా రెండు గంటలు ఓటింగ్ కోసం సమయాన్ని పెంచారు. ఉదయం 5.30 గంటలకే పోలింగ్ సిబ్బంది ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎం యంత్రాల పనితీరును పరిశీలిస్తారు. ఏజెంట్ల సమక్షంలో తిరిగి వాటిని క్లియర్ చేసి సీల్ వేస్తారు. ఒక వేళ ఈవీఎంలు పనిచేయకుంటే ఓటింగ్ సమయం ప్రారంభమయ్యే వరకు మరో ఈవీఎంను అందుబాటులోకి తెస్తారు. సాయంత్రం 7 గంటలకు ఓటింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలను తరలిస్తారు. ఈ కళాశాలలోని రెండో అంతస్తులో స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రచారం ముగిసిన ఈ నెల 27 సాయంత్రం నుంచే ఎస్ఆర్ఆర్ కళాశాల పరిసరాల్లో 200 మీటర్ల మేర 144 సెక్షన్ విధించారు.
బరిలో30 మంది..
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరులో 30 మంది అభ్యర్థులు ఉన్నారు. శనివారం పోలింగ్ జరగనుండగా, మంగళవారం వీరి భవితవ్యం తేలనున్నది. అధికార టీఆర్ఎస్ పక్షాన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి..
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో హెల్త్, హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఈ డెస్కుల్లో విధులు నిర్వహిస్తారు. మాస్కులు ధరించి రాని ఓటర్ల కోసం ఇక్కడ మాస్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి వ్యక్తికి టెంపరేచర్ పరీక్షించేందుకు అన్ని కేంద్రాల్లో థర్మామీటర్లు ఏర్పాటు చేశారు. ఈవీఎం బ్యాలెట్పై ఓటు వేసేందుకు కుడిచేతికి గ్లౌస్లు కూడా అందిస్తున్నారు. కొవిడ్ బాధితులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, విద్యుత్, నీడ, తాగు నీటి వసతులు కల్పిస్తున్నారు. రెండు డోసులు టీకా వేసుకున్న సిబ్బందిని మాత్రమే విధుల్లోకి అనుమతించారు.
కొవిడ్ బాధితులకు గంట సమయం..
కొవిడ్తో బాధపడుతున్న వారికి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. వీరికి ప్రతి హెల్త్ డెస్కులో పీపీ కిట్స్ అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
2,36,873 మంది ఓటర్లు..
హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,36,873 మంది ఓటర్లు ఉన్నారు. అందులో అత్యధికంగా మహిళా ఓటర్లు 1,19,093 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,17,776 మంది, ఒకరు ఇతర ఓటరు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ 79 పోలింగ్ కేంద్రాల్లో 61,673 మంది, జమ్మికుంటలోని 78 పోలింగ్ కేంద్రాల్లో 59,020, ఇల్లందకుంట లోని 29 పోలింగ్ కేంద్రాల్లో 24,799, వీణవంకలోని 55 పోలింగ్ కేంద్రాల్లో 40,099, కమలాపూర్లోని 65 పోలింగ్ కేంద్రాల్లో 51,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
శనివారం సెలవు..
ఉప ఎన్నిక నేపథ్యంలో జూరాబాద్లో శనివారం సెలవు ప్రకటించారు. ఫ్యాక్టరీలు, దుకాణాలు, హోటళ్లు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సెలవు దినం ప్రకటిస్తూ ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కలిగింది.
భారీ బందోబస్తు..
ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందకు 3,865 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 20 కంపెనీలకు చెందిన కేంద్ర పోలీసు బలగాలు కూడా విధుల్లో ఉండగా, 74 మంది ప్రత్యేక పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన 700 మంది పోలీసులతోపాటు ఇతర జిల్లాల నుంచి 1,471 మందిని ఎన్నిక విధులకు రప్పించారు. కాగా, ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు ప్రచారం నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో గుర్తించిన 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు.