ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలో వెల్లివిరిసిన సౌహార్దం వర్ణనాతీతం. తెలంగాణ సాధించిన అభివృద్ధికి జగిత్యాల ప్రతీక అయితే, ప్రగతి ప్రదాత పట్ల జనంలో పెల్లుబుకుతున్న అభిమానానికి తరలివచ్చిన అశేష జనం, వారి జేజేలే సూచికలు. తెలంగాణ సాధించడమే కాదు, రాష్ర్టాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కంకణ బద్ధులైన ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, వాటి సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాకముందే, జగిత్యాల మాత్రం జిల్లా కావడం ఖాయమని కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం విశేషం. 2016 అక్టోబరు 11న జగిత్యాల జిల్లాను ప్రకటించడంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే కొద్దీ ప్రజల్లో సంభ్రమాశ్చర్యాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లాకు కేసీఆర్తో అనుబంధం అంతకంతకూ పెనవేసుకుపోతున్నది. అందుకే బహిరంగ సభకు జనం విశేష రీతిలో తరలివచ్చారు.
ఇతర జిల్లాల మాదిరిగానే జగిత్యాల జిల్లా బహువిధ అభివృద్ధికి నోచుకున్నది. జగిత్యాల సాధిస్తున్న ప్రగతి తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న సమగ్రాభివృద్ధిలో అవిభాజ్య భాగమే. చెరువులు నిండుకుండలై భూగర్భ జలాలు పెరగడం, సాగు భూమి స్థిరీకరణ- విస్తరణ, రైతుబంధు వంటి తోడ్పాట్లు, గురుకులాలు, కళాశాలలు, వైద్య వసతులు, రహదారులు మొదలైనవన్నీ తెలంగాణవ్యాప్తంగా లభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సత్పరిపాలనా ఫలాలు. జగిత్యాల మాదిరిగానే ఇతర కొత్త జిల్లాల ప్రజలు పరిపాలనా సౌకర్యాలు పొందుతున్నారు. కొత్త భవన సముదాయాలు, కొత్త వైద్య కళశాలలు ప్రారంభమవుతున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రజలు తమ అవసరాలను గుర్తించలేరు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలను తానే గుర్తించి వరాల జల్లులు కురిపిస్తున్నారు. దేశ పరిపాలనా రంగంలోనే ఇదొక విప్లవాత్మకమైన విధానం.
జగిత్యాల సభ వేదికగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్బోధ ఆలోచనలను రేకెత్తించేదిగా ఉన్నది. మోదీ ప్రభుత్వ డంబాచారాన్ని ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. ఎల్ఐసీ వంటి బంగారు గుడ్లు పెట్టే బాతులను ప్రైవేటీకరించడమేమిటి? మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ గొప్పగా ప్రకటనలు చేస్తున్నది. కానీ పతంగి మాంజా మొదలుకొని జాతీయ పతాకం వరకు అరొక్క వస్తువు చైనా నుంచి తెచ్చుకోవలసిన దుస్థితి ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి, లక్షలాది బడుగు కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. మహిళలపై, బలహీనవర్గాలపై దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. కేసీఆర్ పిలుపునిచ్చినట్టుగా దేశం ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితిపై కవులు, కళాకారులు, ఉద్యోగులు మొదలైన అన్ని వర్గాల వారు ఆలోచించాలి. విద్వేష రాజకీయాలను తిప్పికొట్టడానికి ముందుకు కదలాలి.