శ్రీశైలం : అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు కృష్ణా నదిలో స్నానాలు చేసి నదీమాతకు పసుపు కుంకుమలు సమర్పించి, నదిలో దీపాలను వదిలారు. అనంతరం ఆలయానికి చేరుకొని క్యూలైన్ల ద్వారా మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయం 3 గంటల సమయంలో ద్వారాలు తెరిచి, స్వామి అమ్మవార్లకు నిత్యకైంకర్యాది పూజాక్రతువులు నిర్వహించారు. 5 గంటల తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో గర్భాలయ, స్పర్శ దర్శనాలను నిలిపివేసి, కేవలం అలంకారణ దర్శనాలు మాత్రమే కల్పించారు.
గంగాధర మండపం, ఉత్తర మాడవీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, నోములు నోచుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే క్యూలైన్లలో భక్తులకు పాలు, అల్పాహారం అందజేసినట్లు వివరించారు.