వరంగల్, జూలై 29 : నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం శుక్రవారం కావడంతో అమ్మవారిని పూలతో అందంగా అలంకరించారు.\
వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, నగరంలోని సంతోషీమాతా, రాజరాజేశ్వరి దేవి ఆలయాల్లో కూడా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాల్లో పండుగ వాతావరణం కనిపించింది. కాగా, శ్రావణ శుక్రవారం కావడంతో నగరంలో పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ కనిపించింది.