డిస్పూర్ : అసోం 15వ ముఖ్యమంత్రిగా డాక్టర్ హిమంత బిస్వా శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. గువాహతిలోని పంజాబరి ప్రాంతంలోని శ్రీమంత శంకర్దేవ్ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం జరుగనుంది. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది. జలుక్బరి నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు హిమంత అసెంబ్లీకి ఎన్నికవగా.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమక్షంలో ఆదివారం జరిగిన కీలక సమావేశంలో బీజేపీ శాసన సభ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జాతీయ నాయకులు అరుణ్ సింగ్, బీఎల్ సంతోష్, అజయ్ జామ్వాల్, బై జయంత్ జే పాండా, దిలీప్ సైకియా, రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్కుమార్ దాస్ తదితర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం సర్బానంద సోనోవాల్ గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను అందజేసిన విషయం తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీకి మూడు విడుతల్లో ఎన్నికలు జరగ్గా.. బీజేపీ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే.