న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. సెంట్రల్ ప్రగతి మైదానం, ధౌలా కువాన్ మధుర రోడ్, మోతీ బాగ్, వికాస్ మార్గ్, రింగ్ రోడ్, రోహ్తక్ రోడ్, సంగం విహార్, కిరారీ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో స్పందించిన పీడబ్ల్యూడీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో భారీ కురవడంతో పలు ప్రాంతాల్లోకి నీరు చేరిందని పీడబ్ల్యూడీ అధికారులు పేర్కొన్నారు. గత 24 గంటల్లో సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురువడంతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.