నిజామాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అగ్నిపథ్ పథకం సరిగా లేదంటే యువతను కాల్చివేస్తారా? అని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. దేశ రక్షణ కోసం సేవ చేసే ఆర్మీ జవాన్లపై కూడా బీజేపీ సర్కార్ నీచ రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పర్యటనలో భాగంగా రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మోతెలో నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. ఆర్మీ ఉద్యోగాలకు మంగళం పాడేందుకే కేంద్రం అగ్నిపథ్ను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన ఈ అసంబద్ధ పథకం వల్లే దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే పనిలో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఆర్మీ ఉద్యోగాలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం సరైనది కాదన్న యువకులపై కాల్పులు జరిపి తెలంగాణ బిడ్డను పొట్టనబెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జై జవాన్.. జై కిసాన్ నినాదం మోదీ పాలనలో నై జవాన్.. నై కిసాన్గా మారిందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్లో జరిగిన ఘటన టీఆర్ఎస్ పార్టీవల్ల జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు.
బీజేపీ రాష్ర్టాల్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ధర్నాలు, దాడులు మీరే చేయించుకుంటున్నారా.. బీహార్, ఉత్తరప్రదేశ్లో జరిగిన అల్లర్ల వెనుక నితీష్, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారా అని బండి సంజయ్ని ప్రశ్నించారు. సైన్యంలో చేరి దేశానికి సేవచేయాలని భావిస్తున్న యువతకు నాలుగేండ్ల తర్వాత ఆర్మీ ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి భవిష్యత్తు ఏం కావాలని అడిగారు. ఏ రంగంలో చూసినా మోదీ ప్రభుత్వానివి మాటలు తీయగా.. చేతలు చేదుగా ఉన్నాయని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సమాధి కడుతారన్నారు.
మోతె స్ఫూర్తికి వందనం
తెలంగాణ వస్తుందో రాదో అన్న రోజుల్లో గ్రామమంతా ఏకమై టీఆర్ఎస్కు మద్దతు తీర్మానం చేసి మట్టి మూట గట్టి తెలంగాణ భవన్కు పంపించిన చైతన్య గ్రామం మోతె అని హరీశ్రావు గుర్తు చేసుకొన్నారు. అభివృద్ధిలో ముందున్నప్పటికీ సహజ ప్రసవాల్లో మనం వెనుకబాటులో ఉన్నామని చెప్పారు. తల్లికి బిడ్డకి ఆరోగ్యాన్ని నష్టం కలిగించే సీ-సెక్షన్ శస్త్రచికిత్స అవసరం ఉంటే తప్ప చేయవద్దని ఆదేశించారు. దీనిపై గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ దవాఖానలు ప్రైవేటు హాస్పిటల్స్ కన్నా మెరుగైన సేవలు అందిస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇంటింటికీ వచ్చి ఆరోగ్య సర్వే చేసి షుగర్, బీపీకి ప్రతి ఒక్క వ్యాధికి ఎన్సీడీ కిట్ నెలకు సరిపడా గోళీలు ప్రభుత్వం ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు.
మోసపోతే గోస పడతాం..
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటవిని మోసపోతే గోస పడాల్సి వస్తుందని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. భీమ్గల్ సభలో మాట్లాడుతూ ఓ సూదికథ చెప్పారు. ‘ఓ దర్జీ బట్టలు కుడుతుండగా సూది ఊడిపోయి కింద పడ్డది. లైట్ పెట్టి వెతికినా దొరుకుతలేదు. దేవుడా సూది దొరికితే కిలో చక్కెర పంచుతానని దర్జీ మొక్కుకున్నాడు. అది విన్న దర్జీ భార్య పిచ్చోడివా అంటూ భర్తను తిట్టిందట. రూ.5 సూది కోసం రూ.50 చక్కెర పంచుతానంటున్నావ్ అంటూ మండిపడిందట. అప్పుడు ఆ భర్త.. సూది అయితే దొరకనీ, చక్కెర ఎగబెట్టుడు ఎంతసేపు అని చెప్పాడట’. అచ్చంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతల తీరు ఇలాగే ఉందని హరీశ్రావు చమత్కరించారు. కుర్చీ అయితే దొరకని… ఇప్పుడు ఏదంటే అది మాటిద్దాం. ఏదంటే అది చెప్పుదాం అన్నట్టుగా బీజేపీ, కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
బాల్కొండ సస్యశ్యామలం
సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన బాల్కొండ నియోజకవర్గం స్వరాష్ట్రంలో నేడు సస్యశ్యామలం అయ్యిందని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాతనే ఈ ప్రాంతం సుభిక్షంగా వెలుగొందుతున్నదని లెక్కలతో సహా వివరించారు. రూ.1,900 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం అమలైనా, రూ.100 కోట్లతో అనేక ఎత్తిపోతల పథకాలు మంజూరైనా, చెక్డ్యాంల నిర్మాణమైనా కేసీఆర్ పాలనలోనే సాధ్యం అయ్యాయన్నారు. ఒకప్పుడు మురికి నీరు, అవస్థలమయమైన ప్రాంతంగా భీమ్గల్కు పేరుండేదని.. ఇప్పుడు మున్సిపాలిటీగా మారిందని, 100 పడకల దవాఖానతో స్థానిక ప్రజలకు త్వరలోనే ఆపద్బంధువు కానున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ దయతో, మంత్రి హరీశ్రావు చొరవతో బాల్కొం డ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వేముల స్పష్టంచేశారు.
– మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
యువత సహనానికి పరీక్ష పెట్టొద్దు
అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలనే ఉద్యమం మొదలైంది బీజేపీ పాలిత రాష్ర్టాల నుంచే. తర్వాతే అది తెలంగాణకు చేరింది. యువత సహనానికి కేంద్ర ప్రభుత్వం పరీక్ష పెట్టొద్దు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ మాటమార్చడం యువత ఆందోళనకు కారణంగా కనపిస్త్నుది.
– విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి
అగ్నిపథ్ అనాలోచిత నిర్ణయం
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అనాలోచిత నిర్ణయం. ఈ పథకంతో బీజేపీ సర్కార్ జవాన్ల బతుకులను బజారుకీడ్చింది. 46 వేల మందిని 90 రోజుల్లో నియమించడం, కేవలం రూ.30 వేల వేతనం నిర్ణయించడం అర్థరహితం. దేశ భద్రత విషయంలో ఇంత బాధ్యత లేని తనం మంచిది కాదు.
– పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి