కమలాపూర్: 17 ఏళ్లు ఈటల రాజేందర్ను చూశారు.. ఒక్కసారి యువనాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు అవకాశం ఇవ్వండి అని మంత్రి హరీశ్రావు ప్రజలను కోరారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్లో అడుగు.. బొడుగు లేదని విమర్శించారు. ఇక్కడున్నది టీఆర్ఎస్, బీజేపీ మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ రెండు పార్టీల్లో దేనికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. అబద్ధాలను నమ్మి ఆగం కావద్దని, ధర్మం, న్యాయంవైపు నిలబడాలన్నారు.
ఇటీవల సభల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కు మానవత్వం ఉందా? అని ప్రశ్నిస్తున్నారని, దేశంలో సీఎం కేసీఆర్ను మించిన మానవతావాది ఎవరైనా ఉన్నారా? అని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఆసరా పింఛన్ తీసుకుంటున్న అవ్వను అడుగు.., కల్యాణలక్ష్మి తీసుకుంటున్న పేదింటి ఆడబిడ్డను అడుగు.., రైతుబంధు తీసుకుంటున్న రైతన్నను అడుగు..కేసీఆర్ మానవత్వం గురించి చెబుతారని ఈటలనుద్దేశించి అన్నారు. కడుపు నిండి ఉన్న ఈటల రాజేందర్.. రైతుబంధు దండుగ అంటున్నాడని, కల్యాణలక్ష్మి పరిగె ఏరుకున్నట్లు అని మాట్లాడుతున్నాడని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైతుబంధు దండుగ అంటూనే ఈటల మాత్రం ప్రతిసారి అక్షరాలా పది లక్షల యాభై వేల రూపాయలు రైతుబంధు కింద తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదని, తన స్వార్థం కోసం మాత్రమే పదవి వదులుకున్నాడని చెప్పారు. ఈటల గెలిస్తే ఆయనతోపాటు బీజేపీకి లాభం.. కానీ గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలందరికీ లాభమని హరీశ్రావు తెలిపారు.
మంత్రిగా ఉండికూడా ఈటల రాజేందర్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు , ఒక్క మహిళా సంఘం భవనం కూడా కట్టివ్వలేదని అన్నారు. ప్రతి మీటింగ్లోనూ ఈటల రాజేందర్ అబద్ధాలతో జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. దళితుల తలరాత మార్చేందుకు దళితబంధు పథకం తీసుకొస్తే.. దాన్ని కూడా ఆపివేయించాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలక్షన్లు అయిపోయాక మళ్లీ వచ్చి దళితబంధు యూనిట్లన్నీ దగ్గరుండి గ్రౌండింగ్ చేయిస్తానని హరీశ్రావు దళితులకు భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తానే చూసుకుంటానని మాట ఇచ్చారు.