హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎస్సీ వర్గీకరణకు(SC classification) మొదటి నుంచి అనుకూలమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేశాం. తప్పనిసరిగా వర్గీకరణ చేయాలని కేసీఆర్ ప్రధాన మంత్రిని కోరారు. జాతీయ స్థాయిలో ఈ అంశం తేలకపోతే రాష్ట్ర పరిధిలోనైనా వర్గీకరణ చేసుకొనే అవకాశం ఇవ్వమని కోరినట్లు ఆయన తెలిపారు.
కానీ, కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. ఒకవేళ కేంద్రం ఆ వెసులుబాటు కల్పించి ఉంటే ఇప్పటికే వర్గీకరణ మన రాష్ట్రంలో అమలవుతూ ఉండేదని పేర్కొన్నారు. ఈ అంశంలో వెనుకడుగు వేయం. వర్గీకరణ కోసం అసెంబ్లీలో, పార్లమెంటులో గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీ(BJP) ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పినా మేనిఫెస్టోలో ఆ విషయాన్ని చేర్చలేదని విమర్శించారు. కనీసం బిల్లు కూడా పెట్టలేదు. దీంతో ఆ పార్టీ చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతోందన్నారు.
మాదిగలను వాడుకున్నది తప్పా వారికి మేలు చేయలేదని ఆరోపించారు. పదేండ్లగా అధికారంలో ఉండి కూడా వర్గీకరణ చేయని బీజేపీకి మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. దళితబంధు కింద 12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అకౌంట్లను ఫ్రీజ్ చేసి పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కేసీఆర్ మాదిగలకు రెండు సీట్లు ఇచ్చి గౌరవించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
నాడు ఉద్యమకాలం నుంచి, నిన్నటి పాలకపక్షం, నేటి ప్రతిపక్షం వరకు మాదిగలను గౌరవించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. నాడు తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా తాటికొండ రాజయ్యని నియమించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వమని హరీశ్ రావ కోరారు. వారి మాటను గౌరవించి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. మాట ఇస్తే తప్పని నైజం హరీశన్నది. అందుకే రేపటి నుంచే MRPS శ్రేణులన్నీ బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటాయని స్పష్టం చేశారు.