ఇంటర్ విద్యను ఉచితంగా ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమే
రూ.300కోట్లు జూనియర్ కళాశాలల అభివృద్ధికి ఇస్తున్నాం..
ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
ఆర్సీపురంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి జూనియర్ కళాశాల ప్రారంభం
తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంది : విద్యాశాఖమంత్రి
అందరి ఆశీస్సులతోనే రాజకీయాల్లో రాణించా : ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి
సొంత నిధులతో జూనియర్ కళాశాల నిర్మాణం అభినందనీయం
సంస్కారం, వినయం భూపాల్రెడ్డి సొంతం
సీఎం కేసీఆర్కు ఆయన అంటే చాలా ఇష్టం
నాకూ ఆయన అంటే గౌరవం
రామచంద్రాపురం, డిసెంబర్ 29 : ప్రజాసేవకు ప్రతి రూపం భూపాలన్న అని ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రా పురంలో ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి సొంత నిధులు రూ. 2.5కోట్లతో నిర్మించిన గీతా భూపాల్రెడ్డి జూనియర్ ప్రభుత్వ కళాశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి ప్రారం భించా రు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సంస్కారం, వినయ, విధేయతలు ప్రవర్తించే అరుదైన నాయకుడు భూపాల్రెడ్డి అని కొనియాడారు. నేటితరం రాజకీయాల్లో విలువలు వెతకాలంటే ముందుగా భూపాల్రెడ్డిని చూపవచ్చన్నారు. సొంత నిధులతో అన్ని హంగులతో జూనియర్ కళాశాల నిర్మించి ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే అంశమన్నారు. భూపాల్రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారంటే ఆయన మంచితనం, ప్రజాసేవ చేయాలనే తపనే కారణమన్నారు. సీఎం కేసీఆర్ భూపాలన్నా అని పిలుస్తారని గుర్తు చేశారు. 40మందితో ప్రారంభమైన జూనియర్ కళాశాల నేడు 886మంది విద్యార్థులు ఉండటం గొప్ప విషయమన్నారు. భూపాల్రెడ్డి కోరిన డిగ్రీ కళాశాల, బాలికల హాస్టల్, వృద్ధాశ్రమం అనుమతుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు నడుస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్పొరేట్ స్కూల్ ప్రవేశానికే గతంలో పోటీ ఉండేదని, ఇప్పుడు గురుకులాల్లో సీట్లకోసం పోటీ ఉందన్నారు. ప్రతి గురుకుల విద్యార్థిపై రూ. 1.25లక్షలు ప్రభు త్వం ఖర్చు చేస్తున్నదన్నారు. చరిత్ర చదవడం కాదు చరిత్రను సీఎం కేసీఆర్ సృష్టించారని కొనియాడారు.
ఖర్చుకు వెనుకాడకుండా
‘గీతా భూపాల్రెడ్డి జూనియర్ కళాశాల నిర్మాణం నా కల. అది నెరవేర్చుకున్నా ను. ఖర్చుకు వెనుకాడకుండా విద్యార్థులకోసం కళాశాల కట్టించానని’ శాసన మం డలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. గీతా భూపాల్రెడ్డి కళాశాల పేరులోని గీతను చూసి విద్యకు సంబంధించిన పేరు అని,సీఎం కేసీఆర్ తక్షణం గీతా భూపాల్రెడ్డి పేరు కళాశాలకు నామకరణం చేసి జీవో జారీ చేశారని కొనియాడారు. పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలకు అనుమతి ఇప్పిస్తే భవనం నిర్మించి ఇస్తానని హామీఇచ్చారు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమంకోసం స్థలం కేటాయించాలని హరీశ్రావును కోరారు. సీఎం కేసీఆర్ విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా పటాన్చెరు నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్ని హంగులతో జూనియర్ కళాశాల నిర్మించారని కొనియాడారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఫారూక్హుస్సేన్, ఎమ్మెల్యే మాణిక్రావు , ప్రభుత్వ విప్లు వెంకటేశ్వర్లు, దామోదర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, మెట్టు కుమార్యాదవ్, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, బూన్, మాజీ ఎంపీపీ యాదగిరి, నర్సింహ , ఐలేష్ పాల్గొన్నారు.
జిల్లాలో రూ.760.55 కోట్ల ధాన్యం కొనుగోలు
సిద్దిపేట, డిసెంబర్ 29: జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో రూ.760.55 కోట్ల 3లక్షల 88వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 95,913 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2021-22 వానకాలం సీజన్లో 3లక్షల17వేల 161ఎకరాల్లో రైతులు వరి పంట సాగుచేశారన్నారు. వరిధాన్యం కొనుగోలు చేసేందుకు మెప్మా, ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 225 ఐకేపీ కేంద్రాల ద్వారా 52,221 మంది రైతుల నుంచి 2లక్షల 10 వేల 69 మెట్రిక్ టన్నుల ధాన్యం, పీఏసీఎస్ల ద్వారా 37,954 మంది రైతుల నుంచి లక్షా 53వేల 738 మెట్రిక్ టన్నుల ధాన్యం, తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 4296 మంది రైతుల నుంచి 18 వేల తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యం, 5 మెప్మా కేంద్రాల ద్వారా 1442 మంది రైతుల నుంచి 6,234 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగిందన్నారు.