కరీంనగర్: పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో చేనేత కార్మికులకు మంగళవారం ఏర్పాటు చేసిన చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎల్.రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దాదాపు 2 వేల మంది లబ్ధిదారులకు రూ. కోటి 69 లక్షల 1,803 చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ రాక ముందు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు భరోసా దొరికిందని అన్నారు. చేనేత కార్మికులకు రూ. 100 కోట్లతో రుణ విముక్తులను చేశామని గుర్తుచేశారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు 50 ఏండ్లకే పెన్షన్ ఇస్తున్నామని, ముడి సరుకుకు సబ్సిడీ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్రిఫ్ట్ పథకానికి మంత్రి కేటీఆర్ రూ.30 కోట్లు ఇచ్చారు. కార్మికులు రూ. 800 నుంచి రూ. 1200 కట్టినా రెండింతలు ప్రభుత్వం జమ చేస్తదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 8 పథకాలు వచ్చాయని అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏం ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల పథకాలు ఊడగొట్టి.. నోటి కాడి బుక్క ఎత్తగొట్టిందని ఆరోపించారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును కేంద్రం రద్దు చేసిందని, బోర్డును బలోపేతం చేయాల్సిన బీజేపీ చేనేత కార్మికుల ఉసురు పోసుకుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం 4 శాతం త్రిఫ్ట్ ను రద్దు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం 16 శాతం త్రిఫ్ట్ ఫండ్ను ఇస్తోందని వెల్లడించారు. నేతన్నల కోసం అమలు చేసే ఆరోగ్య బీమా పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. మిమ్మల్ని కాపాడుకున్నోళ్లు ఎవరు? ముంచింది ఎవరు? ప్రజలు గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. న్యాయం, ధర్మం వైపు నిలబడండి. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. నేతన్నల ప్రయోజనం ముఖ్యమా ఆలోచించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం 4 వేల ఇండ్లు ఇస్తే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని మంత్రి హరీశ్ ఆరోపించారు. మీరు ఆశీర్వదిస్తే తమ సొంత జాగలో ఇల్లు ఇస్తాం. స్థలం లేకుంటే ఇల్లు కూడా కట్టి ఇస్తాం హుజూరాబాద్లో పద్మశాలి భవన్ కోసం ఎకరా స్థలం, రూ. కోటి ఇచ్చామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రాబోయే కొద్దీ రోజుల్లో జమ్మికుంటలో కూడా ఎకరా స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని తెలిపారు. మేము మంజూరు చేస్తుంటే.. వాళ్లు రద్దుచేస్తున్నారని ఆరోపించారు. అందుకే వాళ్లను మనము కూడా రద్దు చేయాలి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తాం. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కోకాపేటలో పద్మశాలి భవన్ కోసం రూ. వంద కోట్ల విలువైన భూమిని టాయించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కరోనా వల్ల చేనేత పరిశ్రమ దెబ్బతిన్నది: ఎల్.రమణ
కరోనా మూలంగా చేనేత పరిశ్రమ దెబ్బతిన్నదని టీఆర్ఎస్ సీనియర్ నేత ఎల్.రమణ అన్నారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.