ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
ముగిసిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంఘిక సంక్షేమ గురుకులాల వల్ల సమాజంలో గొప్ప మార్పు వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని జేఎన్యూలాంటి విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్థులు చదువుతున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణ మీడియా అకాడమీ, షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఉన్న విద్యావ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని వివరించారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టు కలం సమాజాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. జర్నలిజంలో దళితుల పాత్రను మెరుగుపర్చడానికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృషి అభినందనీయమని కొనియాడారు. దళిత జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించటం దేశంలోనే చరిత్రాత్మకమని అల్లం నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రముఖ జర్నలిస్టు బుచ్చన్న, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి మారుతీ సాగర్, అకాడమీ సెక్రటరీ నాగుపల్లి వెంకటేశ్వర్రావు, సీనియర్ జర్నలిస్టు కట్టా కవిత తదితరులు పాల్గొన్నారు.