హనుమకొండ: కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. రైతుబంధు ద్వారా 11 విడుతల్లో రూ.72 వేలకోట్లు ఇచ్చామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎక్కడికిపోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని చెప్పారు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హామీలు అమలుచేయాలని కోరిన కేసీఆర్ను ముఖ్యమంత్రి దుర్భాషలాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువని విమర్శించారు.
ముల్కనూర్ ముద్దుబిడ్డ సుధీర్కుమార్కు ఎంపీ టికెట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. ముల్కనూరుకు మొండిచేయి చూపించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తున్నదని చెప్పారు. హస్తం పార్టీ వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఆగిపోయాయని వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదన్నారు.
ఢిల్లీలో మన గెలాబీ జెండా ఎంపీలు ఉంటే తెలంగాణకు రక్షణ అని వినోద్ కుమార్ అన్నారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెప్పారు. అభివృద్ధి అంటే గులాబీ జెండా.. విధ్వంసం అంటే కాంగ్రెస్, బీజేపీలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పచ్చి అబద్ధాలు మాట్లాడే వ్యక్తి బండి సంజయ్ అని వెల్లడించారు.