హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నును 12 శాతానికి పెంచాలన్న జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్రంగా వ్యతిరేకించారు. చేనేత ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేతపై పన్ను విధించరాదని జీఎస్టీ కౌన్సిల్ 2017 మే 18న తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. ఇప్పటికే కరోనాతో కుదేలైన పరిశ్రమను అదనపు పన్ను భారం తీవ్రంగా దెబ్బతీస్తుందని, మొత్తం పరిశ్రమ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవేళ పన్ను భారం పెంపు తప్పదని భావిస్తే చేనేత, పవర్లూమ్ పరిశ్రమపై ప్రస్తుతమున్న 20 లక్షల జీఎస్టీ స్లాబ్ను 50 లక్షలకు పెంచాలని కేంద్రమంత్రికి ఆదివారం రాసిన లేఖలో కోరారు. స్లాబు మార్పు వల్ల లక్షలమంది నేత కార్మికులకు ప్రయోజనం కలగడమేకాకుండా ప్రభుత్వానికి పన్ను నష్టం కూడా స్వల్పంగానే ఉంటుందని పేర్కొన్నారు.
చేనేతపై ఎన్నడూ పన్నులేదు
వచ్చే జనవరి ఒకటి నుంచి వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 12 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని పీయూష్గోయల్ను కేటీఆర్ కోరారు. కరోనాతో రెండేండ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఏకంగా ఏడు శాతం పెంచడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే వస్త్ర, చేనేత రంగాన్ని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిందిపోయి అదనపు భారం మోపడం సరికాదని సూచించారు. దేశ చరిత్రలో ఎన్నడూ చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ ద్వారానే తొలిసారి 5 శాతం పన్ను విధించారని గుర్తుచేశారు. తెలంగాణలో చేనేత రంగం అద్భుత ప్రగతి సాధిస్తూ ప్రపంచ ఖ్యాతి పొందుతున్న తరుణంలో జీఎస్టీ పెంపుపై చేనేత కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
నెలకు ఆదాయం రూ.10 వేలకన్నా తక్కువే
చేనేత రంగంలో లాభాలు లేకపోవడంతో కొత్తతరం ఈ పరిశ్రమకు దూరమవుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంలో ఉంటే, తాజా లెకల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలే మిగిలాయని, 25% కుటుంబాలు పరిశ్రమను వీడి పోయాయని కేటీఆర్ తెలిపారు. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో కొన్నేండ్లలో చేనేత రంగం అంతర్థానమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘తాజా లెకల ప్రకారం చేనేత రంగంలో సుమారు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలే ఉన్నారు. వీరిలో 72 శాతం మహిళలే. ఈ బలహీన వర్గాలకు బలమైన ప్రోత్సాహకాలతో అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉన్నది. కేంద్ర ప్రభుత్వ లెకల ప్రకారమే ఈ రంగంలో సుమారు 77 శాతం మంది పాఠశాల విద్యకూడా దాటని వారున్నారు. ఇలాంటి వారికి సంక్లిష్టమైన పన్నుల చెల్లింపు వ్యవహారంపై అవగాహన ఉండదు. దీంతో వారికి మరిన్ని ఇబ్బందులు తప్పవు. దేశంలో చేనేత రంగంలో పనిచేస్తున్న 67 శాతం కుటుంబాల నెలవారీ ఆదాయం రూ.5 వేలకన్నా తకువ. మరో 26 శాతం మంది కుటుంబాల ఆదాయం రూ.10 వేలకన్నా తకువ. మొత్తంగా 93 శాతం చేనేత కుటుంబాల ఆదాయం రూ.10 వేలకు మించడంలేదు. ఈ పరిస్థితుల్లో వారిపై అదనపు పన్ను భారం మోపడం సరైన నిర్ణయం కాదు. చేనేతను ఒక పరిశ్రమగా కాకుండా దేశ సంసృతి, సం ప్రదాయంగా చూడాలి. గాంధీ మహాత్ముని ఆలోచనల దారిలో ఈ రంగానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలి’ అని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఉత్పత్తి వ్యయానికి తోడు పన్ను భారం
చేనేత రంగంలో లాభాలు ఐదు శాతంకన్నా తక్కువేనని, ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఏడు శాతం పన్ను పెంచడంవల్ల పరిశ్రమ కోలుకోలేకుండా దెబ్బతింటుందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. సంప్రదాయ చేనేత రంగం ఇప్పటికే తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నదని, క్లిష్టమైన మల్టీ స్టేజ్ ప్రొడక్షన్ వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నదని తెలిపారు. ఉత్పత్తి వ్యయాలకు తోడు ఇప్పుడు పన్ను భారం కూడా పెరిగితే డిమాండు తగ్గి కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. గత కొన్నేండ్లలోనే పరిశ్రమకు అవసరమైన కాటన్, యార్న్ తదితర ముడిసరుకు ధరలు 30-40 శాతం పెరిగాయని గుర్తుచేశారు. కరోనా వల్ల దిగుమతులు తగ్గడంతో పరిశ్రమకు అవసరమైన రసాయనాల ధరలు కూడా భారీగా పెరిగాయని, ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో రవాణా ఖర్చులు కూడా మోయలేని భారంగా మారాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో పన్నులు పెంచితే అనేక చిన్నతరహా వస్త్ర, చేనేత యూనిట్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలోని చేనేత, వస్త్ర పరిశ్రమలో 80 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహావేనని, ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై మోపిన పన్నుల భారంవల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. పరిశ్రమ మనుగడకు అదనపు నిర్వహణ మూలధనం అవసరమని, బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు నిధులు ఇవ్వటంపై ఆసక్తిగా లేనందున నేతన్నల కష్టాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రధాని వాగ్దానం ఏమైంది?
చేనేతరంగాన్ని అన్నివిధాలా ఆదుకొంటామని ప్రధాని నరేంద్రమోదీ 2015లో ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘గతేడాది ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి స్వయంగా వోకల్ ఫర్ హ్యాండ్ మేడ్ అన్న నినాదం ఇచ్చారు. చేనేత ఉత్పత్తులను రెట్టింపు చేసి రూ.1.25 లక్షల కోట్లకు పెంచాలని, ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి రూ.10 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు. చేనేతకు మరింత ప్రోత్సాహం ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. జీఎస్టీ పెంపు ప్రతిపాదన కేంద్రం చెప్తున్న మేకిన్ ఇండియా నినాదానికే విరుద్ధం. మనకన్నా చిన్న దేశమైన బంగ్లాదేశ్ కూడా వస్త్ర రంగంలో గొప్ప పురోగతి సాధిస్తున్నది. పన్ను పెంపుతో మన వస్ర్తాల ధరలు పెరిగి అంతర్జాతీయంగా పోటీ పడలేని పరిస్థితి వస్తుంది. దేశీయంగా ఉత్పత్తి వ్యయం పెరిగి విదేశీ పెట్టుబడులు రావడం కూడా గగనమవుతుంది. అంతర్జాతీయంగా హ్యాండ్మేడ్, నేచురల్ ఫైబర్, ఎకో ఫ్రెండ్లీ వస్ర్తాలపై ఆసక్తి పెరుగుతున్నది. ఈ రంగంలో మనదేశానికి అద్భుత అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వస్త్రపరిశ్రమను మరింత బలోపేతం చేయాలి. అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించాలి. అప్పుడే కేంద్రం ప్రతిపాదించిన ఘనమైన ఎగుమతుల లక్ష్యాన్ని అందుకోగలం’ అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.