న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం జరుగనుంది. ఈ సందర్భంగా కొవిడ్-19 వ్యాక్సిన్, ఇతర పరికరాలు, బ్లాక్ ఫంగస్, అత్యవసర మందుల పన్ను రేట్ల తగ్గింపుపై చర్చించేందుకు జీఎస్టీ మండలి భేటీకానున్నది. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో సమావేశం కానున్నది. ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు సమావేశంలో పాల్గొననున్నారు. గత నెల 28న జరిగిన మండలి సమావేశంలో పన్ను మినహాయింపులు సామాన్యులకు చేరాలనే విషయమై బీజేపీ, ప్రతిపక్ష పార్టీల సీఎంల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంటిలేటర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్, మాస్కులు, టీకాలపై పన్ను మినహాయింపు విషయమై మంత్రుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఇవాళ జరిగే సమావేశంలో ఈ నివేదికతో పాటు బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను తగ్గింపు అంశంపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.