ఈనెల నుంచే గ్రీన్ ఫండ్ సేకరణ
విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
బాధ్యతగా గుర్తించాలంటున్న ప్రభుత్వం
పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు
వచ్చే నెల నుంచే ఎనిమిదో విడుత హరితహారం
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
హరిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలుగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతు న్నాయి. కాగా, ఇందులో ప్రతి ఒక్కరికీ బాధ్యత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రం ప్రభుత్వం హరిత నిధి సేకరణకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఈ నెల నుంచే ఈ నిధి సేకరణకు సిద్ధమవుతుండగా, వచ్చే నెల నుంచి ఎనిమిదో విడుత హరితహారం ప్రారంభించనున్నది.
నిర్మల్ అర్బన్, మే 20: రాష్ట్ర ప్రభుత్వం ఏడు విడుతలుగా చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిచ్చింది. మొక్కలు నేడు వృక్షాలై అందరికీ నీడనివ్వడమే కాకుండా సకాలంలో వర్షాలు కురవడం, సమతుల్య వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి, అందరికీ బాధ్యత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా హరిత నిధి (గ్రీన్ ఫండ్) సేకరణకు సిద్ధమవుతున్నది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల వరకు అందరినీ భాగస్వామ్యం చేసి ఆ నిధిని సేకరించి జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే ఎనిమిదో విడుత హరితహారానికి వినియోగించనున్నారు. నిర్మల్ జిల్లాలో 369 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో హరిత నిధిని సేకరించి లక్ష్యానికి మించి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోనున్నారు.
పచ్చదనం పెంచేలా చర్యలు ..
నిర్మల్ జిల్లాలో పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రతి నెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నాయి. వీటిని జిల్లా జనాభా ఆధారంగా జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ ఖాతాల్లో మున్సిపాల్టీల్లో మున్సిపల్ కమిషనర్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. నిధుల నుంచి 10 శాతం హరితహారానికి ఖర్చు చేస్తున్నారు. మొక్కలు నాటడం, ట్రీ గార్డులు కొనుగోలు చేయడం, మొక్కల పెంపకం వంటి వాటికోసం మాత్రమే ఖర్చు చేయాలి
పాఠశాల, కళాశాలల్లో..
పాఠశాల విద్యార్థి నుంచి హరిత నిధి సేకరణ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందే పాఠశాల విద్యార్థి రూ.10, ఇంటర్మీడియెట్ విద్యార్థి రూ.15, డిగ్రీ విద్యార్థి రూ.25, వృత్తి విద్యా కోర్సు విద్యార్థి రూ. 100 యాజమాన్యాలు హరిత నిధికి జమచేయాలి. మే నెలలో జమచేసిన ఈ గ్రీన్ ఫండ్ను జూన్ నుంచి చేపట్టే హరితహారం కార్యక్రమానికి వినియోగించనున్నారు.ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీలపై రూ.50 హరిత నిధికి చెల్లిస్తున్నారు.
శాఖల నుంచి నిధుల సేకరణ ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పచ్చదనం పెంచేందుకు వీలుగా గ్రీన్ ఫండ్కు ఎవరెవరూ ఎంత ఇవ్వాలో నిర్దేశిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, బార్లు, మద్యం షాపుల నుంచి హరిత నిధిని సేకరించాలని ఉత్తర్వులు జారీచేశారు.ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు( అందరూ ఏడాదికి)రూ.6 వేలు, అఖిల భారత సర్వీసు అధికారులు రూ.1200, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యోగులు రూ.300, జడ్పీ చైర్మన్లు రూ.1200, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు రూ.600, వ్యాపార లైసెన్స్ రెన్యూవల్ సమయంలో రూ.1000, బార్లు, వైన్స్లు రెన్యూవల్ సమయంలో రూ.1000, ప్రభుత్వం అందించే నియోజకవర్గ అభివృద్ది నిధి రూ.10 శాతం.ఎంపీటీసీలు,సర్పంచ్లు, కౌన్సిలర్లు రూ.120, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్కు రూ.50సేకరించనున్నారు.
బాధ్యతను గుర్తు చేయడంపై హర్షం
రాష్ట్ర వ్యాప్తంగా అడవుల పెంపు, తద్వారా భావితరాల మనుగడకు ఉపయోగపడేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఏ కార్యక్రమాలకైనా తామంతా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార వర్గాలు స్వాగతించాయి.
హరితనిధి మన బాధ్యత
తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో అందరినీ భాగస్వా మ్యం చేయడం మంచి నిర్ణయం. హరిత నిధి సేకరణ గొప్ప కార్యక్రమం. ఇది మనందరి బాధ్యత కూడా. ప్రభుత్వ నిర్ణయం మేం స్వాగతిస్తున్నాం. పాఠశాలలో ప్రవేశాలు పొందే సమయంలో ఏడాది లో ఒకేసారి రూ. 10 విద్యార్థి నుంచి సేకరించడం కూడా పచ్చదనంపై మన బాధ్యతను గుర్తు చేస్తుంది. –జుట్టు గజేందర్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్.
రూ.వెయ్యి చెల్లించిన..
ఈ ఏడాదికి హరిత నిధిని చెల్లించా. ఏటా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటం. పోయినేడు ట్రేడ్ లైసెన్స్కు రూ.500 చెల్లించగా..ఈ ఏడాది రూ.1000 కలిపి మొత్తం రూ.1500 కట్టించుకున్నరు. ఇది భావితరాలకు మంచి చేసే నిర్ణయం. ఇది ఓ బాధ్యతలాగా భావిస్తే అందరికీ మంచిది.
– సంగారి శ్రీనివాస్, ప్రింటింగ్ ప్రెస్ యజమాని, నిర్మల్.