మన ఊరి బడి ముస్తాబయ్యింది. అన్ని హంగులు దిద్దుకొని కొత్త రంగులు వేసుకొని సరికొత్త రూపాన్ని సంతరించుకొన్నది. విద్యారంగం కొత్త పుంతలు తొక్కాలని, పేద సాదలు మంచి విద్యనభ్యసించాలని, నాపల్లె సీమల పిల్లలు కూడా ఉన్నత స్థాయినందాలని దానికి బడుల ఆధునీకరణ నుంచే మార్పు మొదలవ్వాలని అభిలషించిన దార్శనికుడు కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమైన మనఊరు – మనబడి కార్యక్రమం మొదటి విడతలో ఎంపికై పనులు పూర్తయిన బడులు రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభం కాబోతున్నాయి.
ఊరిబడితో ఉండే అనుబంధం ప్రత్యేకం, జీవిత ప్రాథమిక దశలో బడి ఇచ్చిన అనుభూతులు, తరగతి గది నేర్పిన పాఠాలు, ఉపాధ్యాయుల మార్గదర్శనం, సహాధ్యాయుల సాంగత్యం, ప్రతీ ఒక్కరి జీవితంలో చివరికంట నిలిచే మధురస్మృతులు. బడులు భవితకు సోపానాలు, చరితకు తొలిచరణాలు, బాల్యంలో ఇక్కడి అనుభవాలు మిగతా జీవితానికి దారినేర్పరుస్తాయి. బడి వాతావరణం ఆలోచనలని ప్రభావితం చేస్తుంది. అక్షరాభ్యాసం నుంచి పదవ తరగతి వరకు ఉండే ఈవిద్యార్జన ప్రస్థానంలో సంభవించే సంఘటనలు, తారసపడ్డ మిత్రులు, ప్రత్యేకించి కొందరు ఉపాధ్యాయులతోఅనుబంధం తదుపరి జీవితానికి పునాదులవుతాయి. దిక్సూచిలవుతాయి.మంచివాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు మనిషికి విశ్వసాన్నిస్తాయి.
మంచి ఆలోచనలకూ కేంద్ర బిందువులవుతాయి, మంచి వసతులు బోధనకు అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. తద్వారా ఉన్నత విద్యాబోధనా జరిగి ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దుతాయి. సమాజానికి మేధావులను, బాధ్యతాయుతమైన వ్యక్తులను అందజేస్తాయి. నేటి విద్యార్థులే రేపటిపౌరులు.ఆరోగ్యకరమైన పరిసరాలు, వసతులు, వారిని ఆరోగ్యకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. తద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా, ఉన్నతంగా, విద్యార్థులకు ప్రభుత్వబడులలో వసతులను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మనఊరు – మనబడి కార్యక్రమానికి అంకురార్పణ అయ్యిం ది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో ప్రయివేటీకరణకు ఎర్రతివాచి పరుస్తున్నవేళ, విద్యారంగానికి కేటాయింపులు తగ్గుతున్న వేళ తెలంగాణలో మాత్రం ప్రభుత్వం దానికి భిన్నంగా ఆలోచించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, త్రాగునీరు, ఐటీ, సంక్షేమం తదితర రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించి స్వయం పాలన మాధుర్యాన్ని, ఫలితాల్ని ప్రజలకు చేర్చిన కేసీఆర్ ఇప్పుడు విద్యారంగ సమూల వృద్ధికి నడుం బిగించారు.
ఏది సంకల్పించినా, ఏ ప్రణాళిక రచించినా గొప్పగా కల్పన చేయగలిగే కార్యశిల్పి కేసీఆర్. ఒక కాళేశ్వరం, ఒక మిషన్ భగీరథ, ఒక రైతుబంధు, ఒక దళితబంధు, నిరంతర విద్యుత్తు నేడు మనఊరు – మనబడి ఆయా వ్యవస్థల్లో గుణాత్మక, మార్పుని తెచ్చే బృహత్ పథకాలు. దేశంలో ఏరాష్ట్రంలోలేని విధంగా 26065 ప్రభుత్వ పాఠశాలల్లో 7283 వేలకోట్ల బడ్జెట్తో మూడు విడతల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. తొలివిడతలో 9123 పాఠశాలల్లో రూ. 3497 కోట్లతో ఈ కార్యక్రమ ప్రణాళిక ముందుకు దూసుకుపోతున్నది.
పన్నెండు రకాల పనులను అన్నిపాఠశాలల్లో పూర్తిచేసేందుకు ప్రభుత్వ యంత్రాం గం నిరంతరం కృషిచేస్తోంది. నిరంతర నీటిసరఫరాతో టాయిలెట్లు, విద్యుత్ వ్యవ స్థ ఆధునీకరణ చేపట్టారు. దీంట్లో భాగంగా ప్రతీక్లాసు రూమ్లో ట్యూబ్లైట్లు ఫ్యాన్లు బిగించి, క్లాసురూం వాతావరణాన్ని ప్రకాశ వంతంగా, సౌకర్యవంతంగా చేస్తున్నారు. ప్రతీ స్కూల్లో నల్లాల ద్వారా సురక్షిత నీరుకోసం ఏర్పాటు, అవసరం మేరకు నూతన కిచెన్ షెడ్లు, అదనపు తరగతిగదులు, ప్రహరీగోడలు, హైస్కూళ్లలో డైనింగ్ హాళ్ల నిర్మాణం. అవేకాక అన్నిపాఠశాలలకు డ్యూయల్ డెస్కులు, గ్రీన్ చాక్ బోర్డులు, ఉద్యోగులకు ఫర్నిచర్, హైస్కూల్లో డిజిటల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన పరికరాలు అందజేసి మొత్తం పాఠశాలను మా ఊరుబడి, అమ్మఒడి అన్నంతగా తీర్చిదిద్దడం జరుగు పాఠశాలలో ఖాళీస్థలంలో పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.
మన ఊరు మనబడిలో భాగంగా మౌ లిక వసతులు కాకుండా ఇంగ్లిష్ మీడియం బోధించాలనే నిర్ణయం గ్రామీణ విద్యార్థులకు ఒకకొత్త అవకాశాన్ని కల్పించింది. వేలకు వేలు పోసి ప్రయివేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కోసమే పిల్లలను చేర్పించే తల్లిదండ్రులు ఈనిర్ణయంతో ప్రభుత్వ బడుల వైపు చూడటం మొదలుపెట్టారు. కొత్తగావచ్చిన 2.5 లక్షల అడ్మిషన్లు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో, సమాజంలో ప్రభుత్వ విద్య పట్ల మారిన దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమ పర్యవేక్షణలో భాగంగా జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యేకించి గిరిజన గూడేల్లో, మారుమూల ప్రాంతాల్లో మనఊరు మనబడి ఆయా పాఠశాలల్లో తెచ్చిన మార్పును చూసినప్పుడు, ప్రస్తావించినప్పుడు స్థానికుల మోములో కనిపించిన ఆనందంతో, ప్రభుత్వ సంకల్పం నెరవేరిందనేంత సంతృప్తినిచ్చింది. మాబడి మరింత అద్భుతం అనేభావం విద్యార్థులతో జరిపిన సంభాషణలో తెలిసింది.
వసతులెన్ని ఏర్పరిచినా, అద్భుత సౌకర్యాలు కల్పించినా వాటి నిర్వాహణ సరిగా లేకపోతే లక్ష్యం వ్యర్థం అవుతుంది. అం దుకే ఈకార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెం ట్ కమిటీలను భాగస్వామ్యం చేశారు. అదే సమయంలో సేవాభావం కలిగిన వ్యక్తులకు, సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని సంకల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.
కేసీఆర్ లక్ష్యమైన ఈ మనఊరు మనబడి దేశ విద్యారంగానికి ఒక ప్రత్యేక ఉదాహరణ అవుతుందనడంలో సందేహంలేదు. నేడు ప్రారంభ కార్యక్రమాలతో మొదలయ్యే ఈ సంబురం ప్రతినిత్యం కొనసాగుతుంది. అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికనుగూణంగా ఈవిద్యాలయాలు ఆధునికతను సంతరించుకొని, అద్భుత విద్యా కర్మాగారాలై పాఠశాల విద్యలో ఒకకొత్త మార్పునిస్తాయి, దానికి ప్రతివాడ, ప్రతిగ్రామం, ప్రతిప్రాంతం, ప్రతిఒక్కరు కలిసిరావాలని తెలంగాణ చదువుల తల్లిగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి తోడవ్వాలని కోరుకుందాం.
ఆయుధం చేయలేని పనిని అక్షరం చేస్తుంది, విజ్ఞానం అజ్ఞానపు తిమిరాన్ని తొలగిస్తుంది. చదువు చరిత్ర సృష్టించగలిగే అద్భుత పుటలను లిఖిస్తుంది. విద్యాదీపం సమస్త చీకట్లను తొలగిస్తుంది. ఈ కార్యక్రమం చరిత్రపుటలలో నిలిచిపోతుంది. నూతన విద్యాకుసుమాలను సృష్టిస్తుంది.
జై తెలంగాణ జైభారత్
– రావుల శ్రీధర్ రెడ్డి
99855 75757
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ విద్య, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ )