తిరుపతి, జూ లై: శ్రీశ్రీశ్రీ గోవిందరామానుజ చిన్న జీయర్ స్వామివారి షష్టిపూర్తి మహోత్సవం బుధవారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద ఉన్న శ్రీచిన్నజీయర్ మఠంలో ఘనంగా జరిగింది. టీటీడీ ఈఓ డా.కెఎస్.జవహర్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
షష్టిపూర్తి మహోత్సవంలో భాగంగా జులై 10వ తేదీ నుంచి మఠంలో నాళాయిర దివ్యప్రబంధ పారాయణం జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవ దివ్యదేశాల నుంచి తీసుకొచ్చిన ప్రసాదం, పుష్పమాలను శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామివారు స్వీకరించారు.
శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామివారు 1961వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా తిరుక్కుర్ముడిలో జన్మించారు. శ్రీరంగంలో వైదిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 30ఏండ్ల పాటు అధ్యాపక కైంకర్యం నిర్వహించారు. భగవదనుగ్రహంతో పదేండ్ల క్రితం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి బాధ్యతలు స్వీకరించారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామివారితో కలిసి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల కైంకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.