గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
దేవరాజు మహారాజుకు బాలసాహిత్య అవార్డు
తగుళ్ల గోపాల్కు యువసాహిత్య పురస్కారం
2020-21లో 20 భాషల్లో అవార్డుల ప్రకటన
ముగ్గురు తెలంగాణ బిడ్డలు.. ప్రముఖ కవి,ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రముఖ రచయితలు దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాల్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉన్నది. సాహిత్యానికి సంబంధించిన మూడు విభాగాల్లో తెలంగాణ సాహితీ గరిమ మరోసారి ప్రపంచానికి వెల్లడైంది. – సీఎం కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 30 : పల్లె పదం పరవశించింది. గాలి పెదవులు తాకి వినిపించిన వెదురుగానానికి అపూర్వ గౌరవం దక్కింది. వద్ది మద్దెల మీద వల్లంకితాళానికి ఆటపాటల దరువేసిన గురువుపై సాహిత్యం పన్నీరు జల్లింది. బుద్ధుని మునివేలి పద్మంలో.. జైన తీర్థంకరుల జపమాలలో.. హఠయోగి వేమన అచల యోగంలో వెన్నెలలు కురిపించిన మన వేమన గోరటి వెంకన్నను ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలంగాణ పల్లె పదాల సాహితీ గరిమ భారతీయ సాహిత్య సిగలో సిరిమైల్లె విరిసింది. తన ప్రజలకోసం.. తన పల్లెల కోసం.. తన ప్రజల పదాల కోసం తానే పదమై.. పాటై.. స్వరమై.. ఆకాశమంత ఎత్తార్చిన గొంతుక భారతీయ జానపదానికి తలమానికమై నిలిచింది.
ప్రజాకవి, వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ 2020-21 సంవత్సర పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన రచించిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి ఈ అవార్డును ఇస్తున్నట్టు అకాడమీ ప్రకటించింది. ఆయనతోపాటుగా సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని తగుళ్ల గోపాల్కు, బాలసాహిత్య అవార్డును దేవరాజు మహారాజుకు ప్రకటించారు. ముగ్గురు రచయితలూ తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన ముగ్గురు రచయితలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందనలు తెలిపారు. గోరటి వెంకన్న సాహిత్యం ప్రపంచ మానవుడి వేదనకు అద్దం పడుతుందని అన్నారు. మొత్తం 20 భాషలకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొన్నది. మొత్తంగా ఏడు కవిత్వ పుస్తకాలు, రెండు నవలలు, ఐదు షార్ట్ స్టోరీలు, రెండు నాటకాలు, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, సాహిత్య విమర్శ, పురాణేతిహాసాలకు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కాయి. గుజరాత్, మణిపురి, మైథిలి, ఉర్దూ భాషలకు సంబంధించిన అవార్డులను తరువాత ప్రకటిస్తామని తెలిపింది. త్వరలో నిర్వహించబోయే అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కారంతోపాటు, లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని పేర్కొన్నది. తెలుగు భాషకు సంబంధించి డాక్టర్ సీ మృణాళిని, జీ శ్రీరామ్మూర్తి, డాక్టర్ కాత్యాయని విద్మహే జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.
గోరటి వెంకన్న ‘వల్లంకి తాళం’
గోరటి రచించిన ‘వల్లంకి తాళం’ కవితా గేయ రచనకు గాను కేంద్ర సాహిత్య అవార్డు లభించింది. ఈ కవితాసంపుటిలో 32 గేయరూప కవితలున్నాయి. ప్రతి పదంలో.. ప్రతి పాదంలోనూ పచ్చదనం నిండుగా కనిపించే.. అపూర్వమైన కవితాసంపుటి ఈ వల్లంకి తాళం. ఇందులోని కొన్ని కవితా పంక్తులు..
అందాల తనువెల్ల వంపుకున్న అడవి/ అలరించిన తలపించె ఆకు పచ్చని కడలి/ నిడివన్నదె లేని నీలి గగనం కింద/ పారటాకుల వలువ పంచుతున్నది సలువ/ కావి రంగుతోని కనిపించె కొండలు/ పైనవోయె దూది పడవల విడుదులు/ గిరిమంద పొదుగులు జారె సెలయేరులు/ శిలల నునుపుగ తొలిసె అలల మొనలు/
పల్లె బతుకుల మధ్య ఒదిగి ఎదిగిన కవికి తప్ప ఈ భావోద్వేగం మరొకరికి సాధ్యం కాదు. తెలంగాణ పల్లె పదాలలోని సాహితీ గరిమ ఇది. ఇన్నేండ్లకు ఈ పదాలకు.. ఈ పాటలకు.. ఈ మట్టి మనిషి మహోన్నతకు, నిలువెత్తు మనిషితనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. పాలమూరులో పూసిన పున్నమి వెన్నెల గోరటి వెంకన్న 1963లో నాగర్కర్నూల్ జిల్లా, గౌరారం (తెలకపల్లి)లో నర్సింహ, ఈరమ్మలకు జన్మించారు. ఈయనకు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆయన తండ్రి మంచి కళాకారుడు, తల్లి సైతం పాటలు పాడుతుండటంతో గోరటికి చిన్నప్పటి నుంచే పాటల మీద ఆసక్తి కలిగింది. ఊరిలో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి మాస్టారు వెంకన్నలోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలు తీసుకువచ్చి ఇచ్చారు. వాటిలో పాటలను వెంకన్న అలవోకగా పాడేవారు. వల్లంకి తాళంతోపాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలను రచించారు. రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ‘నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో’ పాటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘జై బోలో.. జై బోలో.. అమరవీరులకు జై బోలో..’ ‘పల్లే కన్నీరు పెడుతుందో’ పాటలతో గోరటి ప్రజా వాగ్గేయకారుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు.
అవార్డులు.. రివార్డులు:
2006: హంస అవార్డు , 2007: తెలుగువర్సిటీ ఉత్తమ సంపుటి పురస్కారం, 2014: ఉగాది పురస్కారం, 2016: కాళోజీ సాహిత్య పురసారం , 2016: జలధి లైఫ్ టైం అచీవ్వెంట్ అవార్డు , 2018: వేటూరి ప్రతిభాపురస్కారం, 2018: అరుణ్సాగర్ విశిష్ట పురస్కారం, 2018: గుమ్మడి వెంకటేశ్వరరావు అవార్డు, 2019: తెలంగాణ సార్వస్వత పరిషత్ సినారె అవార్డు , 2020: శాసనమండలి సభ్యుడిగా నామినేషన్ – (గవర్నర్ కోటా)
డాక్టర్ దేవరాజు మహారాజు “నేనంటే ఎవరు”
గాయపడ్డ ఉదయం వచన కవితకు 1991లో తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారం
రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారం
తెలుగు వర్సిటీ కవితా పురస్కారం
దాశరథి దంపతుల సత్కారం
తొలి ఎక్స్రే పురస్కారం
సురమౌళి అవార్డు
పరచుచూరి రాజారామ్ సాహిత్య పురస్కారం
ప్రఖ్యాత రచయిత దేవరాజు మహారాజు రచించిన ‘నేనంటే ఎవరు’ రచనకు బాలసాహిత్య పురస్కారం లభించింది. కవిగా, కథారచయితగా, నాటకకర్తగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా దేవరాజు మహారాజు అనేక రచనలు చేశారు. సమాజంలో శాస్త్రీయ అవగాహన పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యంగ్య రచనలుచేశారు. దేవరాజు మహారాజు ఫిబ్రవరి 21, 1951న వరంగల్ జిల్లా కోడూరులో జన్మించారు. స్వగ్రామం వడపర్తి. భువనగరి, హైదరాబాద్లో విద్యాభాసం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1975లో జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ, 1979లో డాక్టరేట్ అందుకొన్నారు. తెలంగాణ ప్రజల భాషలో తొలి కథల సంపుటిని ప్రచురించి ప్రశంసలు అందుకొన్నారు. భారతీయ భాషల కవిత్వం, కథలను తెలుగులోకి అనువదించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకుడిగా వ్యవహరించారు. పదేండ్లుగా నేషనల్ బుక్ట్రస్ట్-న్యూఢిల్లీ సలహాసంఘం సభ్యులుగా ఉన్నారు. ఎయిడ్స్పై అవగాహన కోసం తెలుగులో తొలిపుస్తకం రచించారు. 150 మంది భారతీయ కవులను, 50 మంది మరాఠీ దళిత కవులను కవితా భారతి, మట్టిగుండె చప్పుళ్లు కవితా సంకలనాల ద్వారా పరిచయంచేశారు. ఒరియా మహాకవి సీతాకాంత్ మహాపాత్ర కవితలను అనువదించారు. హిందీ కవి హరివంశ్రాయ్ బచ్చన్ ‘మధుశాల’ను తెలుగులోకి అనువదించారు.
తగుళ్ల గోపాల్.. దండకడియం
యువకవి తగుళ్ల గోపాల్ రాసిన కవితా సంపుటి ‘దండ కడియం’కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండలో 1992 జనవరి 8వ తేదీన గోపాల్ జన్మించారు. తల్లిదండ్రులు కిష్ణయ్య, ఎల్లమ్మ. కలకొండ జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి వరకు, అనంతరం పదో తరగతి వరకు ఏపీఆర్ఎస్ నాగార్జునసాగర్లో చదువుకొన్నారు. కల్వకుర్తి ఉషోదయ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ నేరేడ్మెట్లో డీఎడ్-డైట్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయలంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ప్రస్తుతం వెల్దండ మండలం అజిలాపురం యూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు దండకడియంతోపాటు తీరొక్కపువ్వు రచనలు చేయగా, ‘దండకడియం’కు యువ సాహిత్య పురస్కారం లభించింది.