Hostel | కరీంనగర్ కలెక్టరేట్ : హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు సర్కారు తీపి కబురందించింది. ప్రతినెలా చెల్లించే మెస్ చార్జీలను 30 శాతానికి పైగా పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కరీంనగర్ జిల్లాలోని ఐదు వేల మందికి లబ్ధి చేకూరనుండగా విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు విరివిగా నిధులు వెచ్చిస్తున్నది. ఈ దిశగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో 30 శాతానికి పైగా మెస్ చార్జీలను పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలంటూ ఆదేశించగా, అధికారులు యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసి పంపించారు. జిల్లావ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదువుతున్న 5వేల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.
ఐదేళ్ల క్రితం పెంచిన మెస్చార్జీలతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్న విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భోజన చెల్లింపులు పెంచేందుకు కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నెలకు 2 వేలు, ప్రీమెట్రిక్ వారికి నెలకు 1,500 చొప్పున అందించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉమ్మడిగా ప్రతిపాదనలు రూపొందించి, అందజేయాలంటూ చేసిన సూచనతో జిల్లా నుంచి ఇప్పటికే పంపినట్లు అధికార వర్గాల సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో 750 నుంచి 1,050 వరకు ఉన్న మొత్తాన్ని 2017-18లో 950 నుంచి 1,500కు రాష్ట్ర ప్రభు త్వం పెంచింది.
తరగతుల వారిగా ఒక్కో విద్యార్థికి 31.50 నుంచి 50 వరకు పెరిగింది. ప్రస్తుతం 3నుంచి 7వ తరగతి వరకు 1,200, 8 నుంచి 10వరకు 1,500, పోస్ట్మెట్రిక్ 2 వేల వరకు పెంచనున్నది. అయితే, కరోనా, ఇతరత్రా కారణాలతో రెండు, మూడేళ్లుగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం ఇబ్బందిగా మారింది. దీంతో సర్కారు మెస్చార్జీలు పెం చేందుకు నిర్ణయించింది. ప్రస్తుత మెనూ ప్రకారం రోజు రెండు పూటల భోజనం, ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్, వారానికోసారి మాంసాహా రం అందించాల్సి ఉంటుంది.
అయితే, అనేకచోట్ల గుత్తేదారులు మెనూ ప్రకారం భోజనం సరఫరా చేయడం లేదు. దీనిపై వార్డెన్లు చేసిన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చార్జీలు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర స్థాయిలో సంక్షేమ హాస్టళ్ల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, మెస్చార్జీల పెంపు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మెస్చార్జీలు పెంచితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన డే స్కాలర్లకు ఉపకార వేతనాలు కూడా పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.