కరీంనగర్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణపై విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురువారం కరీంగనర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ చేసే ప్రొక్యూర్మెంట్, అలాగే ఎఫ్సీఐ లేవీ సేకరణ వంటి అంశాలంపై అవగాహన లేకుండా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడే ముందు అన్ని విషయాలు తెలుసుకొని అవగాహనకు వచ్చిన తర్వాతనే మాట్లాడాలి.
కానీ కిషన్ రెడ్డి మాత్రం..మంత్రి అందులోనూ తెలంగాణ వ్యక్తి అన్న విషయం మరిచిపోయి పచ్చి అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 4.53 లక్షల సంచుల ధాన్యం మాయం అయినట్లు ఎఫ్ సీఐ నివేదిక ఇచ్చిందని, ఈ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మాయం చేసారని, అందుకే విచారణ కోరుతున్నామంటూ కిషన్రెడ్డి చెప్పడం పచ్చి అవగాహన రాహిత్యం అన్నారు. 2020-2021లో రాష్ట్రంలో రెండు పంటలు కలపి 40.50 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేసామన్నారు. అందులో కిషన్రెడ్డి చెపుతున్న లెక్కలు 0.1 శాతం కాదన్నారు. అయినా ఆ బస్తాలు కూడా మాయం కాలేదన్నారు.
రాష్ట ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక బస్తా మిస్యూస్ అయినా.. వాటికి ఆర్.ఆర్. యాక్టు కింద తిరిగి రికవరీ చేస్తామన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. బస్తాల్లో ధాన్యం మాయం అయితే.. ఆ పని చూసుకోవాల్సింది కేంద్రం కాదని, రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. అసలు ధాన్యం బస్తాలకు కేంద్రానికి ఉన్న సంబంధం ఏమిటీ ? ఎంఎస్పీ పెట్టి కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వమే కదా? వాటిని బియ్యం చేసి ఇచ్చిన తదుపరి మాత్రమే కేంద్రంకు అధికారం ఉంటుంది కదా అని సూటిగా ప్రశ్నించారు.
ఈ మాత్రం కూడ తెలియకుండా కిషన్రెడ్డి మాట్లాడటం ఆయన పచ్చి అబద్ధాలుకు నిదర్శనమన్నారు.
తాము ఏ విచారణకైనా సిద్ధమని, తమ వెంట ఎఫ్ సీ.ఐ అధికారులు వస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే కాకుండా గన్నీ బ్యాగులు లేవని కేంద్ర మంత్రి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని దమ్ముంటే కేంద్ర మంత్రి వచ్చి లెక్క పెట్టుకోవచ్చన్నారు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని ఘాటుగా హెచ్చరించారు. వీటితో పాటుగా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అనేక విషయాలపై ఆబద్ధాలు చెప్పారని మంత్రి గంగుల అధారాతోసహా బయట పెట్టారు.