Gangula Kamalakar | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ‘ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మాకొస్తరు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ దైవసమానులని, ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి వెళ్లడని చెప్పారు. ‘ఒకవేళ వాళ్లు మా వాళ్లను తీసుకెళ్లా లని చూసినప్పుడు, మేము గేట్లు తెరిస్తే కాం గ్రెస్లో ఎవ్వరూ మిగలరు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్కు ప్రజలు అధికారం ఇచ్చారని, ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని మాత్రమే సూచిస్తున్నామని పేర్కొన్నారు.
గురువారం తెలంగాణభవన్లో కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ము ఖ్యనేతలతో సమావేశం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితెల సతీశ్కుమార్, సుంకె రవిశంకర్, పార్టీ నేతలు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, తుల ఉమ, రామకృష్ణారావు తదితరులతో కలిసి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. తమకు ఓపిక లేదని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 నుంచి రైతుబంధు ఇస్తామని, రైతురుణమాఫీ చేస్తామని, రైతులు పండించిన పంటలకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రైతులు దుక్కిదున్ని ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, వారికి సకాలంలో రైతుబంధు నిధులు ఇవ్వాలని కోరారు. ప్రజలకు వివిధ పథకాలను ఫలానా తేదీలోగా ఇస్తామని చెప్పింది మీరా..మేమా? అని ప్రశ్నించారు. ఆయా హామీలను నిలబెట్టుకోవాలని బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా గుర్తుచేస్తున్నామని చెప్పారు. తాము రైతుల పక్షాన నిలబడటం తప్పా? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరితే తొందరపడుతున్నారని అనడం భావ్యమా? అని ప్రశ్నించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో గులాబీ జెండా ఎగరేస్తామని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీని నిలువరించేది బీఆర్ఎస్యేనని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎంపీ బండి సంజ య్ కరీంనగర్ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేని లోటు, కరీంనగర్లో బోయినపల్లి వినోద్కుమార్ ఎంపీగా లేనిలోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే 5,600 ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. రాను న్న లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ల్లో బూత్కు 100 ఓట్ల ఆధిక్యం సాధించాలన్న పట్టుదల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు.
బీఆర్ఎస్ను కూకటివేళ్లతో పెకిలిస్తామని ఎంపీ బండి సంజయ్ పేర్కొనడంపై గం గుల కమలాకర్ ఫైరయ్యారు. బీజేపీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న బండి సం జయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ను ఓడించిందే బీఆర్ఎస్ అని చురకలేశారు. సంజయ్ మూడు సార్లు ఓడిపోయారని, అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ను కూకటివేళ్లతో పెకిలిస్తారా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారం టూ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.