నిర్మల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఉద్బోధించారు. విద్యార్థులు మూసధోరణిలో కాకుండా ఇన్నోవేటివ్ పద్ధతిలో పరిశోధనలను కొనసాగించాలని సూచించారు. పరిశోధనలే నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తాయని చెప్పారు. ఆవిష్కరణల నుంచే కంపెనీలు, ఉద్యోగాలు, సంపద పుడుతాయని వివరించారు. సోమవారం ఆయన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్ ఐటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ట్రిపుల్ ఐటీలో టీ-హబ్ సెంటర్ ఏర్పాటు, రూ.3 కోట్లతో మినీ స్టేడియం, వెయ్యి కంప్యూటర్లతో అధునాతన ల్యాబ్, డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ తదితర అంశాలపై తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని అభయమిచ్చారు. నవంబర్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వచ్చి ల్యాప్టాప్లు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థుల కోరిక మేరకు కొత్త కోర్సులు ప్రవేశ పెట్టేందుకు విద్యాశాఖతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తామని చెప్పారు. క్యాంపస్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించారు. ఏటా ఇన్నోవేషన్ వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల అభ్యర్థనను దృష్టిలో ఉంచుకొని 50 అదనపు మాడల్ తరగతి గదులను నిర్మిస్తామని, ఆడిటోరియంను ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చా రు. విద్యార్థుల గవర్నింగ్ కౌన్సిల్ క్యాంప స్ మెయింటనెన్స్ బాధ్యత తీసుకోవాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, శంభీపూర్ రాజు, ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్, కలెక్టర్ ముసారఫ్ అలీ ఫారూఖీ, తదితరులు పాల్గొన్నారు.
మీ పోరాట పద్ధతి నచ్చింది
తమ సమస్యల పరిష్కారానికి ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమం నడిపిన తీరును మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ‘సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి నచ్చింది. చాలా గొప్పగా, మంచి స్ఫూర్తితో పోరాడారు. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాంతియుతంగా కొట్లాడిన పద్ధతి అభినందనీయం. ఈ విషయంలో విద్యార్థులు చాలా పరిణతితో వ్యవహరించారు. కేవలం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికే ఆందోళన చేస్తున్నామని చెప్పడం ప్రశంసనీయం. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కొవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. విద్యావ్యవస్థ అతలాకుతలమైంది. మళ్లీ గాడిలో పడాలంటే కొంత సమయం పట్టింది, ఈ క్రమంలోనే ట్రిపుల్ఐటీ విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న వసతులను మరింత మెరుగుపరిచే బాధ్యతను తీసుకుంటా’ అని కేటీఆర్ చెప్పారు.
‘విద్యార్థులు కింద కూర్చోవడం నాకు నచ్చలేదు. అయితే అందరం కిందనైనా కూర్చోవాలి. లేదా పైన కూర్చోవాలి. ఇలా సగం సగం కూర్చోవడం బాగోలేదు. నవంబర్లో మళ్లీ వచ్చే సరికి కుర్చీలు ఏర్పాటు చేస్తాం. దానికయ్యే డబ్బును వెంటనే మంజూరు చేస్తాం. ఆడిటోరియంలో మార్పులు చేయాలని ఆదేశిస్తాం. నా జీవితం 70 శాతం హాస్టల్లోనే గడిచింది. హాస్టల్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించేందుకు సమయం పడుతుంది’ అని పేర్కొన్నారు. రోజూ భోజనం బాగుంటుందా..? ఇయ్యాల్నే మంచిగ పెట్టిండ్రా? అని విద్యార్థులను కేటీఆర్ అడగడంతో .. ఈ రోజే అని వారి నుంచి సమాధానం వచ్చింది. దీంతో నవంబర్లో మళ్లీ వచ్చే సరికి అన్నీ బాగుండాలని, ప్రతిరోజూ ఇలాగే ఉండాలని వీసీని ఆదేశించారు.