న్యూఢిల్లీ : దేశంలో పిల్లలకు సంబంధించిన కరోనా టీకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ 2-18 సంవత్సరాల మధ్య పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్లో ఇప్పటికే 2-6 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ మొదటి డోసు వేయగా.. ఈ వారంలో రెండో మోతాదు అందించనున్నారు. 12-18 సంవత్సరాల మధ్య పిల్లలకు రెండో మోతాదుల టీకా వేశారు. అయితే, ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ వరకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది.
పిల్లలకు టీకాపై ఢిల్లీ ఎయిమ్స్లో ట్రయల్స్ జరుగుతుండగా.. పిల్లల వయసుల వారీగా కేటగిరీలుగా విభవించి.. మూడు దశల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మొదట 12-18 సంవత్సరాల పిల్లలపై ట్రయల్స్ ప్రారంభించారు. ఆ తర్వాత 6-12 సంవత్సరాల వయసు పిల్లలపై ప్రయోగాలు చేపట్టారు. ప్రస్తుతం చివరగా రెండో మోతాదు టీకాను 2-6 సంవత్సరాల పిల్లలకు ఇవ్వనున్నారు. ఈ మేరకు పిల్లల కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. ఇప్పటి వరకు టీకాలు వేసిన పిల్లల్లో ఎవరికీ దుష్ప్రభావాలు కనిపించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ ఢిల్లీ ఎయిమ్స్తో సహా దేశవ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో 575 మంది పిల్లలపై ట్రయల్స్ సాగుతున్నాయి. మొదటి డోసు వేయగా.. పలు చోట్ల రెండో మోతాదు సైతం అందించారు. పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్ను వినియోగించ వచ్చా? వద్దా? అనే అంశంపై ట్రయల్స్ ఫలితాల తుది నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఫలితాల్లో టీకా సురక్షితం అని తేలింది.
ఈ క్రమంలో త్వరలోనే పిల్లలకు కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ దేశంలో జరుగుతున్నాయన్నారు. రిక్రూట్మెంట్ పూర్తయిందని, పరిశీలన.. రోగ నిరోధకశక్తి డేటా తయారు చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ చివరి నాటికి తుది డేటా వస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.