ఎస్పీఆర్ హిల్స్లో దారుణం
అదనపు కట్నం కోసం మొదటి భార్య హత్య
జైలుకు వెళ్లివచ్చి మరో యువతితో ప్రేమ వివాహం
నలుగురు పిల్లలున్న విషయాన్ని దాచడంతో మొదలైన వివాదం
పీకలదాకా తాగి రెండో భార్యను హతమార్చిన వైనం
పరారీలో నిందితుడు
బంజారాహిల్స్, జూన్ 6 : మొదటి భార్యను చంపేశాడు. జైలుకు వెళ్లి వచ్చాడు. 40 ఏండ్ల వయస్సులో 21 ఏండ్ల యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడి అప్పటికే నలుగురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి పెండ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య నిలదీయడంతో డంబెల్తో దాడిచేసి హతమార్చి, కాళ్లు, చేతులు విరిచేసి, డ్రమ్ములో కుక్కేసి పారిపోయాడు. ఈ దారుణం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబ్నగర్ జిల్లా పాలకొండ తండాగ్రామానికి చెందిన రుడావత్ అనిల్(40) వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బోదమర్రిగూడ గ్రామానికి చెందిన అనితను 2009లో ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నం 2లోని ఇందిరానగర్లో నివాసముండేవాడు. వీరికి నలుగురు పిల్లలున్నారు. డెకరేషన్ పనులు చేసే అనిల్కుమార్ భార్యను అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో పాటు 2020 మే నెలలో ఇంట్లోనే హత్య చేశాడు. 45 రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు.
యువతితో ప్రేమ వివాహం..!
ఇదిలా ఉండగా.. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి హఫీజ్పేటలో నివాసముంటున్న వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం సూర్యతండాకు చెందిన ముదావద్ సరోజ (21)తో అనిల్కు పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే పెండ్లి అయిన విషయాన్ని దాచిపెట్టిన అనిల్ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి సరోజను తొమ్మిదినెలల కిందట వివాహం చేసుకున్నాడు. ఎస్పీఆర్ హిల్స్లోని సుభాష్చంద్రబోస్నగర్లో గదిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. వీరి కాపురం సాఫీగా సాగుతున్న క్రమంలో అనిల్కు గతంలోనే పెండ్లి అయ్యిందని, నలుగురు పిల్లలు ఉన్నారని, భార్యను హత్యచేసి చంపేశాడని, ఇటీవలే జైలునుంచి భయటకు వచ్చాడని సరోజకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అనిల్ పీకలదాకా మద్యం, గంజాయి సేవించి ఇంటికి వచ్చి భార్యను చితకబాదేవాడు. ఇటీవల తన నలుగురు పిల్లలను కూడా ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో ఈనెల 1న భార్యాభర్తల మధ్యన మరోసారి గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన అనిల్ భార్యను డంబెల్స్తో తలపై బాదాడు. తీవ్రగాయాలపాలైన భార్యను దవాఖానకు తీసుకువెళ్తున్నానని, ఎవరికి చెప్పవద్దు అంటూ పిల్లలకు చెప్పాడు. పిల్లలను క్యాబ్ బుక్చేసి ఇందిరానగర్లో ఉంటున్న వారి తాత అంజానాయక్ వద్దకు పంపించారు. అప్పటికే సరోజ మృతిచెందింది. ఇది గుర్తించిన అనిల్ చేతులు, కాళ్లు విరిచి భార్య మృతదేహాన్ని ఇంట్లో నీళ్లు పట్టే డ్రమ్ములో కుక్కేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పైనుంచి బట్టల మూటలతో నింపి మూత పెట్టి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు.
భర్తతో మృతురాలు సరోజ (ఫైల్ ఫోటో)
పిల్లలు చెప్పడంతోనే వెలుగులోకి..!
కాగా తాత ఇంటికి వెళ్లిన పిల్లలు ఈనెల 1న సరోజను కొట్టిన విషయాన్ని చెప్పడంతో పాటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన అనిల్ తండ్రి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. సరోజ తండ్రి భీముడుకు విషయం చెప్పడంతో వారిద్దరూ కలిసి అన్ని ప్రాంతాల్లో గాలించిన తర్వాత ఆదివారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో తమ కూతురు సరోజ కనిపించడం లేదని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సోమవారం ఉదయం ఎస్పీఆర్ హిల్స్లోని నిందితుడి ఇంటికి వెళ్లిన పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోకి ప్రవేశించి గాలింపు చేపట్టారు. గదిలోని డ్రమ్ములో కుళ్లిన స్థితిలో ఉన్న సరోజ మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.