Road Accident | ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల – బత్తలూరు మధ్యలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను దాటి, ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తోంది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు తీవ్రంగా డ్యామేజ్ కావడంతో ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి తరలించారు.