తూప్రాన్, మే 5: “వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తానన్న హామీ ఏమైందని, కాంగ్రెస్ అంటే బోనస్ కాదు బోగస్” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ ఎదురుగా తూప్రాన్, మనోహరాబాద్ మండలాల ప్రజలు, కార్యకర్తలతో నిర్వహించిన రోడ్షోకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ. 2,500, తులం బంగారం ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు బంద్ చేసిన కాంగ్రెస్కు రాష్ట్రంలో మహిళలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కౌలు రైతులకు రూ. 15వేలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కరోనాలో సైతం కేసీఆర్ రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమచేశారని, ఆడబిడ్డల పెండ్లి అయితే రూ.లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, ఈ కాంగ్రెసోళ్లకు ఏంపుట్టిందని దుయ్యబట్టారు. చేతగాని ప్రభుత్వమని, అంతామోసమన్నారు. కేసీఆర్ను పట్టుకుని పేగులు మెడలో వేసుకుంటా, అంగిలాగు ఊడపీకుతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, చావు నోట్లో తలపెట్టి వచ్చిన కేసీఆర్ను పట్టుకుని అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. అహంకారంతో గాలిలో ్ల ఉన్న కాంగ్రెసోళ్లను భూమి మీదికి తేవాలంటే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నడిమిట్ల బీజేపోడు మోపయ్యిండని, పొరపాటున బీజేపీకి ఓటేస్తే మన బతుకులు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టేనన్నారు. రైతులంటే బీజేపీకి గిట్టదని, అదానీ, అంబానీలాంటి కార్పొరేట్లకు సేవ చేస్తారన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ రూ.350 ఉన్న సిలిండర్ను రూ. వెయ్యి రూపాయలు, రూ. 60 ఉన్న పెట్రోల్ను రూ. 100, ధర పెంచి గరీబోళ్ల ఉసురు పోసుకున్న బీజేపీకి ఓటేద్దామా అన్ని ప్రశ్నించారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి మాటలు సంక్రాంతికి ముందు వచ్చే పిట్టల దొర మాటలని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు గోవిందా అని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని, తూప్రాన్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో యాభై వేల మెజార్టీతో కేసీఆర్ను గెలిపించుకున్నామని, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర నాయకుడు ర్యాకల శేఖర్గౌడ్, తూప్రాన్ జడ్పీటీసీ రాణి సత్యనారాయణగౌడ్, తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, మనోహరాబాద్ మండలాధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీపీ పురం నవనీతారవి, తూప్రాన్ పట్టణాధ్యక్షుడు సతీశ్చారి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, సీనియర్ నాయకులు రాజేశ్వర్శర్మ, చంద్రారెడ్డి, ప్రభాకర్రెడ్డి, సంతోష్రెడ్డి, అంజాగౌడ్, కుమ్మరి రమేశ్, సిందె చంద్రం పాల్గొన్నారు.
రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ట్రస్టు ద్వారా ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ పెట్టి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి హైదరాబాద్లో ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. ఒక్క రూపాయికే ఫంక్షన్హాల్ అద్డెకు ఇస్తానన్నారు. నియోజకవర్గం మొత్తంలో ప్రతి ఒక్కరికీ రూ. 10 లక్షల ప్రమాద బీమా చేయిస్తానన్నారు.