పటాన్చెరు, మే 17: దేశ భవిష్యత్ యువత భుజస్కంధాలపై ఉందని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అన్నారు. శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణంలోని కిన్నెర సెమినార్ హాల్లో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రెండో పట్టాల ప్రదానోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకను ఆయన ప్రారంభించారు. పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పబ్లిక్ పాలసీ పట్టాలు పొందిన విద్యార్థులు కీలక దేశాభివృద్ధిలో పాత్ర పోషిస్తారన్నారు. భారత రాజ్యాంగం గొప్పతనం, జాతీయ మానవ హక్కుల కమిషన్ విధులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఈ సందర్భంగా పట్టభద్రులను అభినందించారు. గీతం మారుతున్న కాలానికి తగ్గట్టుగా సామాజిక స్పృహతో డిమాండ్ ఉన్న కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు జ్ఞానంతో పాటు ఉపాధి కల్పించేలా ఆత్మవిశ్వాసం గీతం క్యాంపస్లో కల్పిస్తున్నట్లు తెలిపారు. కౌటిల్యలో పట్టాల ప్రదానోత్సవంలో 25మందికి స్నాతకోత్తర (పీజీ) డిగ్రీలను, అత్యుత్తమమైన ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. యనమండ్ర మల్లికార్జునరావు బంగారు పతకాన్ని, ప్రణీత పుల్లను రాజు, ప్రియా భట్కర్లు సంయుక్తంగా బంగారు పతకాన్ని అందుకున్నారు.
అంతర మైత్ర డీన్ అవార్డును అందుకున్నారు. పబ్లిక్ పాలసీ మాస్టర్స్ ప్రోగ్రామ్ మొందటి ర్యాంకర్గా ప్రణీత పుల్లంరాజు గీతం ప్రెసిడెంట్ బంగారు పతకాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్, కౌటిల్య డీన్ ప్రొఫెసర్ సయ్యద్ అక్బరుద్దీన్, గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు. కౌటిల్య సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ కన్వల్ పాల్గొన్నారు.