గజ్వేల్, మే 17: రైతుల నుంచి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తనూజ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆమె హమాలీలు, రైతులతో మాట్లాడారు. ధాన్యం సేకరణ ఎంత వరకు వచ్చిందో అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు వస్తున్న కారణంగా త్వరగా కొనుగోలు చేసిన బస్తాలను లోడ్ చేయాలన్నారు. రైతుల నుంచి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
మిరుదొడ్డి, మే 17: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పెద్దలింగన్నగారి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని లింగుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికందిన పంట కండ్లముందే తడిసి కొట్టుకుపోతుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి ఇస్తామన్న బోనస్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
అకాల వర్షం కర్షకుల పాలిట శాపంగా మారింది. ఈనెల 16న కురిసిన వానకు ఉమ్మడి మిరుదొడ్డి మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేక ధాన్యం ఎండకు ఆరకుండా తేమ శాతాన్ని ఎక్కువగా చూపించడంతో అధికారులు వడ్లను తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్పాలిన్ కవర్లు ఇవ్వమంటే లేవని అధికారులు చెప్పడంతో చేసేదేమీలేక అద్దెకు తెచ్చుకుంటున్నామని రైతులు పేర్కొన్నారు. వర్షం వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందించాలని కోరారు.