మాచారెడ్డి/భిక్కనూరు, జూలై 25 : ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్ఎస్ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, భిక్కనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, బూత్ ఏజెంట్లతో ‘సర్’ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 267 బూత్లలో ఏ ఒక్క ఓటు కోల్పోకుండా డిజిటల్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
మాచారెడ్డి మండలంలో ఓటర్ ఆన్లైన్ ప్రక్రియ దాదాపు 90 శాతం, భిక్కనూరు మండలంలో 99శాతం పూర్తయినట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మినహాయించకుండా, కొత్త ఓటర్ల నమోదు చిరునామా మార్పులు వివరాల సవరణలో పార్టీ కార్యకర్తలు బీఎల్వోలకు సహకరించాలని సూచించారు. ఆగస్టు 3 వరకు కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘సర్’ ప్రక్రియ వందశాతం పూర్తయ్యేవరకూ ప్రతి బూత్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మాచారెడ్డి మండల అధ్యక్షుడు పగడాల బాల్చంద్రం, నాయకులు శ్రీకాంత్రెడ్డి, హంజీనాయక్, బూస శ్రీనివాస్, బట్ట రమేశ్, తోకల కిషన్, అబ్దుల్ ఖాన్, శ్రీశైలం, శంకర్, బాబు, నవీన్రెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాజ్, దేవరాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.