భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో భువనగిరి పట్టణం జనసంద్రమైంది. రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. కేసీఆర్ను చూడగానే ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీశారు. మధ్యాహ్నం నుంచే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా భువనగిరికి చేరుకున్నారు. సాయంత్రం భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సులో భువనగిరికి చేరుకోగానే దారి పొడవునా పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్షోలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ నూతనోత్తేజాన్ని నింపారు. కేసీఆర్ బస్సు వెంట వేలాదిమంది ప్రజలు, కార్యకర్తలు ర్యాలీగా ముందుకు సాగారు.
భువనగిరి పట్టణంలో నిర్వహించిన కేసీఆర్ బస్సుయాత్ర, రోడ్షో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. నియోజకవర్గం నుంచి ప్రజలు ముఖ్యంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం పార్టీ శ్రేణుల ఉత్సాహం రెట్టింపైంది.