అమరావతి : నిత్యం అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు (Chandrababu) మరోసారి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ప్రచార భేరిలో జగన్ మాట్లాడారు.
పేదలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునే వాడు జగన్ కాదని స్పష్టం చేశారు. రైతులకు భూమి మీద సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్(Land Titling Act) యాక్ట్ ఉద్దేశమని పేర్కొన్నారు . ప్రస్తుతం చేస్తున్న సర్వే పూర్తయిన తరువాత ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని , ఇన్సూరెన్స్ కూడా చేస్తుందని వెల్లడించారు.
చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. మేనిఫెస్టో (Manifesto) లో ఎప్పుడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 99 శాతం హామీలు అమలు చేసినా ఘనత వైసీపీదేనని అన్నారు. 59 నెలల వైసీపీ (YSP) పాలనలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో 600 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఏపీ ప్రజల బతుకులు బాగు చేయడానికి లంచాలు లేని అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు తన మనుషులతో వృద్ధులకు వలంటీర్ల ద్వారా పెన్షనులు ఇంటికి రాకుండా చేశారని ఆరోపించారు.