భారతదేశంలో పురుషుల క్రికెట్కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మాయిల క్రికెట్ ఎదుర్కొన్న బాధల గురించి షాకింగ్ నిజాలు వెల్లడించారు. 2006 వరకు మహిళా క్రికెట్పై బీసీసీఐ సరైన ఫోకస్ పెట్టలేదని విమర్శించారు.
ఆయన రాసిన పుస్తకం ‘నాట్ జస్ట్ ఎ నైట్వాచ్మెన్’ విడుదలైనప్పటి నుంచి వినోద్ రాయ్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా క్రికెట్ అవస్థలను వెల్లడించారు. ‘‘2006లో మహిళలు, పురుషుల క్రికెట్ను మెర్జ్ చేయడానికి శరద్ పవార్ ముందుకొచ్చే వరకు ఎవరూ మహిళా క్రికెట్ను సరిగా పట్టించుకోలేదు.
అప్పుడే మహిళ క్రికెటర్లకు సరైన జెర్సీలు లేవని నాకు తెలిసింది. పురుష క్రికెటర్ల కోసం తయారు చేసే జెర్సీలనే కట్ చేసి మళ్లీ కుట్టేసి మహిళలకు ఇస్తున్నారని తెలిసి నేను షాకయ్యా. వెంటనే ఆ జెర్సీలు తయారు చేసే నైకీ సంస్థతో ఈ విషయం గురించి చర్చించా. మహిళలకు ప్రత్యేకంగా జెర్సీలు తయారు చేయాలని స్పష్టంగా చెప్పాను’’ అని రాయ్ వెల్లడించారు.
అలాగే మహిళలకు సరైన శిక్షణ, కోచింగ్ సదుపాయాలు, క్రికెట్ గేర్లు, ట్రావెల్ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు, రిటైనర్లు అన్ని విషయాల్లో చాలా చేయాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 2017 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరడంతో అందరి దృష్టి మహిళల క్రికెట్పై పడింది. అప్పుడే వాళ్లకు దక్కాల్సిన అటెన్షన్ దక్కిందని రాయ్ చెప్పారు.
సెమీఫైనల్ మ్యాచ్లో వెటరన్ ప్లేయర్ హర్మన్ప్రీత్ కౌర్ ఏకంగా 171 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్ చేర్చింది. అయితే దీని గురించి ఆమె తనతో మాట్లాడినప్పుడు.. ‘‘నాకు కాలు పిక్క పట్టేసింది సార్. పరిగెత్తలేనని అర్థమై సాధ్యమైనన్ని సిక్సులు కొట్టాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది’’ అని రాయ్ వెల్లడించారు. ఆ మ్యాచ్ తన దృష్టిలో వాళ్లకు దక్కాల్సిన వాటికి సాక్ష్యమన్నారు. అవసరమైన సపోర్ట్ ఇవ్వకుండా కప్పు కొట్టాలని ఎలా ఆశిస్తామని ప్రశ్నించారు.
ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత జట్టు ఆటగాళ్లు చాలా మంది తమ సమస్యలు తనతో చెప్పుకున్నారని రాయ్ గుర్తుచేసుకున్నారు. తాము ఉండే హోటల్స్లో కనీసం తమకు అందాల్సిన ఆహారం కూడా అందేది కాదని, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో సమోసాలు తిని మ్యాచ్ ఆడేవాళ్లమని ప్లేయర్లు తనతో చెప్పినట్లు రాయ్ వివరించారు. 2017 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత పరిస్థితులు కొంత మెరుగయ్యాయని పేర్కొన్నారు.