పాల్వంచ/భద్రాచలం, ఏప్రిల్ 18: ఎల్ఆర్ఎస్ చేయడం కోసం ఇద్దరు మున్సిపల్ ఉ ద్యోగులు, ఓ చోరీ కేసును మాఫీ చేసేందుకు ఇద్దరు పోలీసులు, ఓ ప్రైవేట్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డారు. పాల్వంచలో టౌన్ప్లానింగ్ సూపర్వైజర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి రూ.15వేలు, భద్రాచలంలో ఓ ఎస్సై, కానిస్టేబుల్, సీసీ కెమెరా ప్రైవేట్ టెక్నీషియన్ రూ. 20 వేలు తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేశ్ తన మూడు ప్లాట్లను ఎల్ఆర్ఎస్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నాడు. పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ సూపర్వైజర్(టీపీఎస్) వెంకటరమణి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్నకుమార్ ఎల్ఆర్ఎస్ చేయడం కోసం మూడు ప్ల్లాట్లకు రూ.30 వేలు డిమాండ్ చేశారు. రూ.15 వేలు ఇస్తానని కనకేశ్ ఒప్పందం కుదుర్చుకొని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించాడు.
కనకేశ్ గురువారం టీపీఎస్, అవుట్సోర్సింగ్ ఉద్యోగికి రూ.15 వేలు లంచం ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్టు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ రమేశ్ వెల్లడించారు. మరో ఘటనలో… భద్రాచలం పాత మార్కెట్లోని ఓ గోడౌన్ నుంచి ఈ నెల 12న మర్రి సాయితేజ, మరో ఇద్దరి సాయంతో పంచదార బస్తాలు దొంగిలించాడు. వాటిని ఆటోలో వేసుకొని వెళ్తుండగా కానిస్టేబుల్ శంకర్.. సీసీ కెమెరాల సాయంతో సాయితేజను గుర్తించాడు. అతడిపై కేసు నమోదు కాకుండా చేయడంతోపాటు ఆటో, సెల్ఫోన్లను వదిలిపెట్టేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సాయితేజ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం సాయితేజ నుంచి టౌన్ ఎస్సై మూలగుండ్ల శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్, ప్రైవేటు ఆపరేటర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసినట్లు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.