Gold Smuggling | విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తున్న ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న ఒక మహిళ సహా ఐదుగురు అజర్బైజాన్ పౌరులు దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు. వారిని కస్టమ్స్ అధికారులు వ్యక్తిగతంగా తనిఖీ చేసినప్పుడు బంగారం ఆభరణాలు బయట పడ్డాయి. వైర్, బెల్ట్ బకిల్, హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ తదితర వస్తువుల రూపంలో 3.5 కిలోల బంగారం వారు స్మగ్లింగ్ చేస్తున్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.44 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు అజర్ బైజాన్ పౌరులను అరెస్ట్ చేశామని వెల్లడించాు.
ఇటీవల షార్జా నుంచి వచ్చిన విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1.07 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం తెలిపారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల ఒకటో తేదీన చెన్నై విమానాశ్రయం ఇంటర్నేషనల్ టర్మినల్ వద్ద సదరు ప్రయాణికురాలిని తనిఖీ చేసి, బంగారం జప్తు చేశామని తెలిపింది. ఆమె తన లోదుస్తులు, పేస్ట్ రూపంలోనూ 1.69 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొంది. ఆమెను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.