అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై గత నెల ఆఖరులో వాదనలు ముగియగా.. కోర్టు తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం నేడు తీర్పును వెల్లడించనుంది. సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని.. బెయిల్ రద్దు చేసి ఆయనపై ఉన్న కేసులను వేగంగా విచారించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జగన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జిషీట్లను సీబీఐ నమోదు చేసిందని రఘురామ పిటిషన్లో పేర్కొన్నారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కావడం లేదని సీబీఐ కోర్టుకు వివరించారు. సీఎం జగన్పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని కోరారు. పిటిషన్లో సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఈ పిటిషన్పై ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు.
అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీబీఐ కౌంటర్ వేయడానికి నిరాకరించింది. సీఎం జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజాయిండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారానికే వదిలేస్తున్నామని తెలిపారు. బెయిల్ రద్దు చేయాలా? వద్దా? అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజాయిండర్లో పేర్కొన్నారు. దీంతో జగన్, రఘురామ తరపు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించారు కోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీలో, వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.