హుజురాబాద్ : ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం’ బాగుపడదనే నానుడి నగ్న సత్యం. గత పాలకుల చేతిలో దగాపడ్డ తెలంగాణ రైతాంగం దుస్థితే ఇందుకు నిదర్శనం. కానీ, స్వరాష్ట్రంలో ఎవుసం పండుగలా సాగుతున్నది. రైతును రాజును చేసే లక్ష్యంతో రైతుబిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న భరోసాతో కర్షకలోకం సంబురంగా సాగు చేస్తున్నది.
24గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం.. కాళేశ్వర జలాలతో ఎస్సారెస్పీ కెనాల్(డీబీఎం-16) నిండుగా పారడం.. సమయానికి ఎరువులు, విత్తనాలు దొరకడంతో జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన మహిళా రైతు కాయిత రాజవ్వ సాగు సంబురంగా చేసింది.
బంగారు వర్ణంలో మెరిసిపోతున్న వరిని చూసి ఆనందంగా నవ్వుతున్నది. కేంద్రం ధాన్యం కొనేదిలేదని చేతులెత్తేసినా.. కేసీఆర్ ఊళ్లెనే కొంటుండడంతో ధీమాగా ఉన్నది. రైతు బిడ్డ కేసీఆర్ ఉండగా తమకు ఏ ఢోకా లేదని చెబుతున్నది
రైతుల బాధలన్నీ తీరినయ్.. : కాయిత లింగారెడ్డి, మడిపల్లి
ఇంతకుముందు కరంటు లేక తిప్పలయ్యేది. లో ఓల్టేజీతో మోటార్లు కాలేటివి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేది. నీళ్లు లేక పంటలు ఎండిపోయేటివి. కాలువలు సరిగ్గ పారేటివి కాదు. ఒక తడి వస్తే ఇంకో తడి రాకపోతుండె. కాలువ నీళ్ల కోసం ఆపీసర్లను అడిగేటోళ్లం. తెలంగాణ అచ్చినంక అన్ని మారినయ్.
కరంటు 24 గంటలుంటంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంక రైతుల బాధలన్ని తీరినయ్. ఇప్పుడు రెండు పంటలకు నీళ్లత్తయ్. కాలువ బంద్ జేయుండ్రిన్న అని అడిగే పరిస్థితి వచ్చింది. తెలంగాణ సర్కారు అచ్చినంక రైతులకు నాయం జరిగింది.
కాల్వల మీదనే పండుకునేది.. : బైరెడ్డి రవీందర్రెడ్డి, రైతు, పాతర్లపల్లి
అప్పుడు కాకతీయ కాలువ నీళ్ల కోసం కందుగుల దాంక పోయి రాత్రిపూట తూము తీసి అక్కడ్నే పండుకునేది. రైతులందరం మనిషిన్ని పైసలేసుకొని సిబ్బందికి ఇచ్చేటోళ్లం. అయినా వేరే ఊరు రైతులచ్చి లొల్లిజేసెటోళ్లు.
కొన్నిసార్లు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా పంట చేతికొచ్చుడు అనుమానం గానే ఉండేది. ఇప్పుడు ఒక్క గుంట కూడా ఎండిపోకుండా నీళ్లు మా ఊరు దాకా వస్తన్నయి. అప్పటి రోజులు భయంకరంగా ఉండేది
కాలువదీస్తే పొలం మొత్తం పారుతంది..పొన్నాల తిరుపతిరెడ్డి, మడిపల్లి, జమ్మికుంట
తెలంగాణ సర్కారు అచ్చినకెళ్లి రైతులకు సంబురమైతాంది. కరంటు బిల్లులు లేవు. మోటార్లు కాలుడు లేదు. మస్తుగ నీళ్లు వస్తున్నయ్.ఎనకట పంటలు సరిగ్గ పండక పోతుండె. బోర్లున్నా లోపల నీళ్లు ఉండకపోతుండె. కరంటు సక్కంగ రాకపోతుండె. ఇప్పుడు 24 గంటలూ కరంటు ఉంటాంది. కాలువలు పారుతున్నయ్. రైతుబంధుతోటి పెట్టువడి రంది తప్పింది. వడ్లను కూడా తెలంగాణ సర్కారోళ్లే ఊర్లకు వచ్చి కొంటు న్నరు. పైసలు ఖాతల వేస్తాన్రు. ఇంతకన్న ఏం కావాలి? మా రైతులకు.