హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇవాళ దేశంలో ప్రజలకు మేలు చేసే పథకం ఏదైనా రావాలంటే.. ముందుగా అది తెలంగాణలో ఆలోచన గా పుట్టాలి. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు మేధస్సులో పురుడుపోసుకోవాలి. తెలంగాణలో పుట్టిన ఆ పథకం.. రేపు దేశవ్యాప్తంగా ఆమలుకావాలి. పేర్లు వేరు కావొచ్చు.. వేషం వేరు కావొచ్చు.. అంతర్గతంగా స్వరూపం మాత్రం అదే. సినిమాల్లో ట్యూన్ ఒక్కటే ఉండి.. పాట మాత్రం వేరుగా ఉంటుంది అంతే. మన మిషన్ భగీరథను స్వయంగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లగానే హర్ఘర్ జల్ యోజన పేరుతో ఇంటింటికి నల్లా నీళ్లన్నారు.
రాష్ర్టాల పరిస్థితీ అంతే.. తెలంగాణకు రావడం.. ఇక్కడి పథకాలను చూడటం.. వాళ్ల రాష్ర్టాల్లో పేర్లు మార్చుకొని అమలు చేసుకోవడం ఏడేండ్లుగా ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు కేంద్రంతో సహా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సంక్షేమం గురించి పెద్దగా ఆలోచించడం లేదు.. ఎందుకంటే.. తెలంగాణ అమలుచేసే పథకాన్ని యథాతథంగా తీసుకొంటే చాలు కాబట్టి.. ఈ మాటలు ఎవరో అంటున్నవి కావు. సామాజిక రంగ నిపుణులే స్వయంగా అంటున్నవి. వీటన్నింటిలో అత్యంత కీలకమైంది.. దేశ వ్యవసాయ రంగా న్ని ప్రభావితం చేసింది రైతుబంధు పథకం.
ఈ పథకానికి శ్రీకారం చుట్టినప్పుడు.. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్నాథ్సింగ్.. ఈ పెట్టుబడి సాయం ఏ విధంగా చేస్తారు? ఎన్ని కిస్తీల్లో కడతారు అని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. దానికి సీఎం కేసీఆర్.. ‘కిస్తీలు లేవు.. తిరిగి కట్టుడు లేదు. పూర్తిగా పెట్టుబడి కోసమే ఇస్తున్నాం’ అని చెప్పినప్పుడు ఇదెలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోయారు. తరువాత కొంతకాలానికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో రైతుబంధుకు కొత్త వేషం వేసి మోదీ సర్కారు దేశమంతా అమలుచేయనారంభించింది.
ప్రపంచానికే ఆదర్శం
రైతుబంధు దేశ వ్యవసాయరంగాన్నే ప్రభావితంచేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్.. పంట సాగుకు అయ్యే పెట్టుబడిని రైతులకు అందించే పథకాన్ని ప్రవేశపెట్టడం చూసి సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితే వేనోళ్లా కొనియాడింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుబంధు తరహాలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పేరుతో పథకాన్ని మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు భరోసా’, ఒడిశా ప్రభుత్వం ‘కాలియా’ , జార్ఖండ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కిసాన్ ఆశీర్వాద్ యోజన’, పశ్చిమ బెంగాల్ ‘క్రిషక్ బంధు’ పేర్లతో రైతుబంధు పథకాన్నే అమలుచేస్తున్నాయి.
తెలంగాణ కన్నా వెనుకే..
పెట్టుబడిసాయం అందించడంలో రైతుబంధును ఆదర్శంగా తీసుకొన్న కేంద్రం, పలు రాష్ర్టాలు.. తెలంగాణ మాదిరిగా మాత్రం అమలు చేయలేకపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, పరిమితులు, షరతులు లేకుండా ప్రతి రైతుకు ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంటే మరే రాష్ట్రంగానీ, కేంద్రం గానీ ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదు. కేంద్రం పీఎం కిసాన్ కింద ఎకరానికి రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నది. పన్ను చెల్లించేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ఏపీ ప్రభుత్వం రైతు కుటుంబం యూనిట్గా చేసుకొని పంపిణీచేస్తున్నది.
ఎన్ని ఎకరాలు ఉన్నా రూ.7,500 మాత్రమే అందిస్తున్నది. ఒడిశా ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.4 వేలు సాయం చేస్తున్నది. జార్ఖండ్ ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.5 వేలు పంపిణీ చేస్తున్నది. ఐదెకరాల వరకు మాత్రమే వర్తిస్తుంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుకు ఎంత భూమి ఉన్నా రూ.5 వేలు మాత్రం పెట్టుబడి సాయంగా అందిస్తున్నది.