Congress | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారని కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకున్నదా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు ‘చేయి’ జారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వల వేస్తున్నదా? అంటే.. ప్రభుత్వం, ఆ పార్టీ పెద్దలు అనుసరిస్తున్న తీరు నిజమేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. వారం రోజులుగా సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ పెద్దలంతా రైతుల జపం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తుతం అమలు చేయలేకపోయామని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని హామీలను కచ్చితంగా అమలు చేస్తామంటూ మళ్లీ హామీలు గుప్పిస్తున్నారు. ఏయే పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్తున్నారు. చిన్న మీటింగ్ అయినా, పెద్ద బహిరంగ సభ అయినా.. రైతుల అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే రైతుల టెన్షన్ పట్టుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్క రైతు హామీ నెరవేర్చలే
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలతో వల వేసింది. ఇందులో ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. వరి క్వింటాకు రూ.500 బోనస్, డిసెంబర్ 9లోపు రూ.2 లక్షల రుణమాఫీ, రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతుభరోసా, అన్ని పంటలు మద్దతు ధరకు కొనుగోలు, ప్రతి పంటకు మద్దతు ధరకు మించి బోనస్, పంటలబీమా, రైతు కమిషన్ ఏర్పాటు, ప్రతి ఎకరాకు సాగునీరు.. ఇలా రైతులకు అనేక హామీలు ఇచ్చింది. ఇందులో ఏ ఒక్కటీ అమలుచేయలేదు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని పదే పదే చెప్పారు. కానీ, గడువు పూర్తయినా ఆ ముచ్చటే తీయలేదు.
హామీల అమలుకు కోడ్ అడ్డొచ్చిందట
‘రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే అనుకున్నాం కానీ అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రుణమాఫీ, ధాన్యం బోనస్ హామీలను ఎలా అమలు చేస్తాం..?’ పలు సందర్భాల్లో కాంగ్రెస్ మంత్రులు చెప్పిన మాటలివి. కానీ, 100 రోజుల గడువు పూర్తయ్యాకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గడువులోపు అమలు చేయకుండా, ‘కోడ్’ని సాకుగా చూపటం ఏమిటని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ సర్కారు వచ్చాకే తమకు కష్టాలు మొదలయ్యాయని మండిపడుతున్నారు. ఓవైపు సాగునీటి కష్టాలు, మరోవైపు ఎండుతున్న పంటలతో రైతుల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ముఖ్యంగా సాగునీటి కష్టాలు, పంటలు ఎండిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పాలన, నిర్వహణ లోపం వల్లే సాగునీటి కొరత ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఐదారేండ్లుగా కనిపించని దుస్థితి పునరావృతం కావటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలనను పోల్చుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యతిరేకత రోజురోజుకు మరింత పెరుగుతున్నది.
కలవరంలో ప్రభుత్వం
ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి మరోవైపు ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. దీంతో కాంగ్రెస్ పెద్దల్లో కలవరం మొదలైనట్టు తెలిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బ పడటం ఖాయమనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నది. వ్యతిరేకతను తగ్గించేందుకు సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించటం, వచ్చే సీజన్ నుంచి బోనస్, రైతుభరోసా వర్తింపజేస్తామని సమీక్షల్లో తుమ్మల వ్యాఖ్యానించటం గమనార్హం. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ హామీలకు మోసపోయామని, మళ్లీ కొత్త హామీలను ఎలా నమ్ముతామని ఆ పార్టీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.