పార్లమెంటు సాక్షిగా కేంద్ర సర్కారు వెల్లడి
రాష్ట్రంలో మారిన వ్యవసాయ ముఖచిత్రం
అనారోగ్య, కుటుంబ సమస్యలతోనే మరణాలు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ప్రశ్నకు తోమర్ జవాబు
పుష్కలంగా సాగునీరు.. పుట్ల కొద్దీ పంటలు
తోడు నీడగా ప్రభుత్వం.. పెట్టుబడికి సాయం
హైదరాబాద్, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు రైతుల జీవితాల్లో భరోసా నింపాయి. స్వరాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే స్పష్టంచేసింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 1,358గా నమోదైన రైతు ఆత్మహత్యల సంఖ్య.. 2020 నాటికి 466కు దిగొచ్చినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంగళవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య ఐదేండ్లలోనే మూడు వంతులు తగ్గినట్టు స్పష్టమవుతున్నది. రైతుల ఆత్మహత్యలు 2016లో 632, 2017లో 846, 2018లో 900, 2019లో 491, 2020లో 466 చొప్పున నమోదైనట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. రైతు ఆత్మహత్యలకు వ్యవసాయ నష్టాలు మాత్రమే కారణం కాదని, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కేంద్రం పేర్కొన్నది. ముఖ్యంగా ఈ రెండు సమస్యలు రైతు కుటుంబాలను వేధిస్తున్నాయని తెలిపింది. తెలంగాణ వంటి వ్యవసాయాభివృద్ధి రాష్ట్రంలో పంట నష్టంతో రైతులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఉండదనేది వ్యవసాయరంగ నిపుణుల అభిప్రాయం. వారి ఆత్మహత్యలకు ఇతర సమస్యలే ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేయడం గమనార్హం.
సీఎం కేసీఆర్ విధానాలే రైతుకు రక్ష
వ్యవసాయరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అనేక విప్లవాత్మక మార్పులు రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. 24 గంట ల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాల సరఫరా, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు రైతుల జీవితాల్లో నూతనోత్సాహం నింపాయి. ఒక్క రైతుబంధు పథకం ద్వారానే గత ఎనిమిది సీజన్లలో రైతులు రూ.50 వేల కోట్లకు పైగా లబ్ధిపొందారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇంత భారీ మొత్తంలో మరే రాష్ట్రంలోనూ ఆర్థికసాయం అందించలేదు. కేసీఆర్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో కళకళలాడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ రైతుల్లో నైరాశ్యాన్ని పోగొట్టాయి. వారి జీవితాల్లో ఉత్తేజం, ఉత్సాహం నింపాయి.