మమ్మల్ని పీక్కుతినే రాబందులు లేరు
రైతుబంధుతో అన్ని విధాలా లాభం
కడిపికొండ రాజిరెడ్డి స్వానుభవం
హనుమకొండ సబర్బన్, జనవరి 1: పై ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కడిపికొండ రాజిరెడ్డి. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం గంటూర్పల్లికి చెందిన ఈయనకు ఎడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమిలో పత్తి, మక్కజొన్న, వరి, కంది, శెనగ పంటలను సాగు చేస్తున్న్తారు. గతంలో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడేవారు. హసన్పర్తికి వెళ్లి పలువురు వ్యాపారులను కలిసి అప్పు కింద విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కొంత మేరకు నగదు అప్పుగా తెచ్చుకొనేవారు. పంట పండిన తర్వాత దాన్ని ఆ షావుకారుకే అమ్మాలనే షరతు ఉండటం వల్ల అక్కడే పంట అమ్మేవారు. వ్యాపారి ఇచ్చిన పైసలకు ఇచ్చిన రోజు నుంచే వడ్డీ రాసుకొనేవాడు. పంటను మాత్రం అడ్డికి పావుషేరు అన్నట్టు తక్కువ ధరకే కొనేవాడు. పైసలు వెంటనే ఇవ్వకుండా నెలలకొద్దీ వాయిదాలు పెట్టేవాడు. కానీ, పెట్టుబడి సాయం అందుతున్నప్పటి నుంచి ‘షావుకారు లొల్లి లేకుండా పోయింది. మిత్తి కట్టే లొల్లి కూడా లేదు’ అని రైతు రాజిరెడ్డి చెప్తున్నారు. రైతుబంధుతో చిన్న చిన్న పనులు చేతుల మీద వెళ్లదీసుకొంటున్నామని, ఆర్థికంగా బలపడుతున్నామని వెల్లడించారు. తమకు అన్ని విధాలా లాభం అవుతున్నదని, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.