నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : మునుగోడు ఓటర్లు దేశంలోని మతోన్మాదులు, విచ్ఛిన్నకర శక్తులకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నిక తీర్పు ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిందని, తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని మరోసారి నిరూపితమైందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడినట్టేనని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ తీరుతో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మంగళవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేక ఆయన పాలనను ప్రజలు భరించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. రాను న్న కాలంలో దేశ సమగ్రాభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ను బలపర్చాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని సూచించారు. ప్రతిపక్షాల గొంతునొక్కేలా ప్రభుత్వ సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఏకంగా ఆదాయపన్ను శాఖతో బెదిరించాలని చూసిందన్నారు.